Congress: పంజాబ్​ లో జీతాలకు డబ్బుల్లేవు.. గుజరాత్​ లో రూ.36 కోట్లతో యాడ్స్​.. కేజ్రీవాల్​ పై కాంగ్రెస్​ ఫైర్​

  • గుజరాత్ లో యాడ్స్ కోసం పంజాబ్ ప్రభుత్వంతో ఖర్చు పెట్టిస్తున్నారని విమర్శ
  • ఆప్‌ అంటే అరవింద్‌ అడ్వర్టైజ్‌ మెంట్‌ పార్టీ అని ఎద్దేవా
  • కేజ్రీవాల్ అవినీతి రాజకీయానికి పాల్పడుతున్నారని మండిపాటు
Congress fires on Arvind Kejriwal

ఆప్ అంటే ‘అరవింద్ అడ్వర్టైజ్ మెంట్ పార్టీ’ గా మారిపోయిందని.. ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అవినీతి రాజకీయాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్ లో ప్రకటనల కోసం పంజాబ్ ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టిస్తున్నారని ఆరోపించింది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ కుమార్ ఈ అంశంపై మాట్లాడారు. భగవంత్‌ మాన్‌ నేతృత్వంలోని పంజాబ్‌ ప్రభుత్వం ఉద్యోగులకు సరిగా జీతాలు కూడా చెల్లించలేకపోతోందని.. అదే గుజరాత్‌లో యాడ్స్ కోసం గత రెండు నెలల్లో రూ.36 కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు.

మద్యం పాలసీతో అవినీతి
ఢిల్లీలో మద్యం పాలసీ ద్వారా ఆప్ అవినీతికి పాల్పడుతోందని అజయ్ కుమార్ ఆరోపించారు. ఆ అవినీతి సొమ్మును గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఖర్చులకు వాడుతున్నారని.. మంత్రుల జేబుల్లోకి, కేజ్రీవాల్‌ ఇంట్లోకి వెళ్తోందని విమర్శించారు. పంజాబ్ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోతున్నా.. గుజరాత్ లో మీడియా యజమానులు మాత్రం సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఎందుకంటే పంజాబ్ ప్రభుత్వం గుజరాత్ లో యాడ్స్ కోసం రెండు నెలల్లో రూ.36 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు.

 ప్రకటనల రాజకీయాలకు, అవినీతికి పాల్పడుతున్న ఆప్‌ ను ‘అరవింద్‌ అడ్వర్టైజ్‌ మెంట్‌ పార్టీ’, ‘అరవింద్‌ యాక్టర్స్‌ పార్టీ’, ‘అరవింద్‌ ఐష్‌ (విలాసం) పార్టీ’గా పిలవాలని అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వ విద్యావిధానం విజయవంతమైతే.. ప్రైవేటు పాఠశాలల్లో చేరికలు ఎందుకు పెరుగుతున్నాయని నిలదీశారు. పంజాబ్‌ లోనూ ఆప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు లక్షల మంది విద్యార్థులు డ్రాపవుట్‌ అయ్యారని పేర్కొన్నారు.

More Telugu News