Uttar Pradesh: ఎన్‌కౌంటర్ చేయొద్దంటూ మెడలో బోర్డు తగిలించుకుని.. పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన హత్యకేసు నిందితుడు

  • ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ నెల 9న ఒకరి హత్య
  • ఈ కేసులో ఇద్దరి అరెస్ట్.. మరొకరు పరారీలో
  • అవసరమైతే నిందితుడిని ఎన్‌కౌంటర్ చేస్తామని ఎస్పీ ప్రకటన
  • భయంతో మెడలో బోర్డుతో ప్రత్యక్షమైన నిందితుడు
Goon Who Accused In A Murder Case Surrender with Placard In Ups Ghaziabad

తాను లొంగిపోతున్నానని, ఎన్‌కౌంటర్ చేయొద్దంటూ ఓ హత్యకేసు నిందితుడు మెడలో బోర్డు తగిలించుకుని పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిందీ ఘటన. యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత నేరగాళ్ల ఆటకట్టిస్తున్నారు. నేరాలకు పాల్పడితే ఎన్‌కౌంటర్లు తప్పవన్న హెచ్చరికలతో ఇప్పటికే పలువురు లొంగిపోయారు. ఈ క్రమంలో ఈ నెల 9న ఘజియాబాద్‌లో ఓ హత్య జరిగింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్న నిందితుడు సోహైల్‌ను పట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావడంతో ఎస్పీ ఓ ప్రకటన చేశారు. అవసరమైతే నిందితుడిని ఎన్‌కౌంటర్ చేస్తామని, ఈ విషయంలో ప్రభుత్వ ఆదేశాలు కూడా ఉన్నాయని హెచ్చరించారు. అంతే, అది విన్న నిందితుడు సోహైల్ ఎన్‌కౌంటర్ తప్పదని భయపడిపోయాడు. ఇక తప్పించుకుని లాభం లేదని పోలీసులకు లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. 

ఈ క్రమంలో మెడకు ఓ బోర్డు తగిలించుకుని పోలీస్ స్టేషన్‌కు బయలుదేరాడు. తాను లొంగిపోతున్నానని, మరోమారు ఇలాంటి నేరాలకు పాల్పడబోనని, తనను ఎన్‌కౌంటర్ చేయొద్దని వేడుకున్నాడు. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News