Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో రాజోలు వైసీపీ నేత భేటీ.. పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారా?

  • నిన్న హైదరాబాద్‌లో పవన్‌తో భేటీ
  • 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన రాజేశ్వరరావు
  • గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరం
YCP leader Bonthu Rajeswara Rao met Pawan Kalyan

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ వైసీపీ నేత బొంతు రాజేశ్వరరావు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో నిన్న భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ రాష్ట్ర మాజీ సలహాదారు అయిన రాజేశ్వరరావు నిన్న హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌తో భేటీ అయ్యారు.

2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గత కొంతకాలంగా ఆయన వైసీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌తో ఆయన భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. త్వరలోనే ఆయన జనసేన కండువా కప్పుకోవడం ఖాయమన్న ఊహగానాలు కూడా వినిపిస్తున్నాయి.

More Telugu News