CM KCR: ముగిసిన కేసీఆర్, కుమారస్వామి సమావేశం... వివరాలు ఇవిగో!

  • హైదరాబాద్ విచ్చేసిన కుమారస్వామి
  • ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో సమావేశం
  • జాతీయ పార్టీ ఏర్పాటుపై వివరించిన కేసీఆర్
  • ముందుండి నడిపిస్తే పూర్తి మద్దతు ఇస్తామన్న కుమారస్వామి
Kumaraswamy meeting with CM KCR concluded

హైదరాబాదులోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మధ్య సమావేశం ముగిసింది. ముఖ్యంగా, జాతీయ రాజకీయాలే ప్రధాన అజెండగా ఈ సమావేశం సాగింది. జాతీయస్థాయిలో పార్టీ స్థాపించాలని భావిస్తున్న కేసీఆర్ తన ఆలోచనలను కుమారస్వామితో పంచుకున్నారు. పార్టీ రూపురేఖలను, సిద్ధాంతాలను, విధివిధానాలను జేడీ(ఎస్) అగ్రనేతకు వివరించారు. పలు రాష్ట్రాల్లో తను సాగించిన పర్యటనల తాలూకు వివరాలను తెలిపారు.

సమావేశం సందర్భంగా కేసీఆర్ ఏమన్నారంటే...

  • జాతీయ రాజకీయాల్లోకి రావాలని నాపై నానాటికీ ఒత్తిడి పెరుగుతోంది. తెలంగాణను నడిపిస్తున్నట్టే దేశాన్ని కూడా నడిపించాలని కోరుకుంటున్నారు.
  • ఏ పర్యటనకు వెళ్లినా మోదీ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలంటూ ప్రజలు నినాదాలతో సూచిస్తున్నారు.
  • తెలంగాణ పట్ల వ్యతిరేక వైఖరితో ఉన్న బీజేపీ పట్ల ప్రజల్లో పూర్తిస్థాయిలో విముఖత కనిపిస్తోంది.
  • ఇటీవల హైదరాబాద్ వచ్చి మమ్మల్ని కలిసిన రైతు నేతలు కూడా తెలంగాణలో అమలు చేస్తున్న రైతు అనుకూల పథకాలు తమకు కూడా కావాలన్నారు. నేను జాతీయ రాజకీయాల్లోకి రావాలని రైతు సంఘాల నేతలు కూడా కోరారు.
  • జాతీయ అజెండాపై ఏకాభిప్రాయం సాధించాం. త్వరలోనే జాతీయ పార్టీ రూపకల్పన చేస్తాం.
  • దేశంలో విచ్ఛిన్నకర ధోరణులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ప్రజలను చీల్చే కుట్రలను కలిసికట్టుగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది.

కుమారస్వామి ఏమన్నారంటే...

  • అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ సాధించిన కేసీఆర్ అనుభవం దేశానికి ఎంతో అవసరం.
  • తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, ఇక్కడ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారు.
  • దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు కేసీఆర్ ముందుండి నడిపిస్తే, అందుకు మేం సంపూర్ణ మద్దతు ఇస్తాం.
  • బీజేపీ విచ్ఛిన్నకర రాజకీయ పన్నాగాలను అడ్డుకోకపోతే దేశంలో రాజకీయ, పాలనాపరమైన సంక్షోభం తలెత్తుతుంది.
  • భావోద్వేగాలతో పబ్బం గడుపుకునే బీజేపీ పాలనకు ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది.
  • బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అనే భావన బలహీనపడుతోంది.
  • కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించే ఫ్రంట్ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.
  • అయితే ప్రాంతీయ పార్టీల మధ్య ఐక్యత ఎంతో అవసరం.


More Telugu News