Devotee: భార్యతో కలిసి ఆలయానికి వచ్చి.. అమ్మవారికి నాలుక కోసి సమర్పించిన భర్త!

  • ఉత్తరప్రదేశ్‌లోని కౌశంబీలో ఘటన
  • అమ్మవారికి పూజలు చేసిన అనంతరం నాలుక కోసి సమర్పించిన భర్త
  • విషమంగా ఆరోగ్యం
Devotee cuts off tongue and offers it to goddess

భార్యతో కలిసి ఆలయానికి వచ్చిన ఓ భర్త తన నాలుకను కోసి అమ్మవారికి సమర్పించాడు. ఉత్తరప్రదేశ్‌లోని కౌశంబీలో జరిగిందీ ఘటన. పట్టణానికి చెందిన సంపత్ (40) భార్య బన్నోదేవితో కలిసి స్థానికంగా వెలసిన శక్తిపీఠమైన కదాధామ్‌లోని శీతలామాత ఆలయానికి వెళ్లాడు. తొలుత ఇద్దరూ కలిసి గంగానదిలో స్నానం చేశారు. అనంతరం పూజలు చేసి ప్రదక్షిణాలు ముగించారు. ఆ తర్వాత వెంట తెచ్చుకున్న బ్లేడుతో నాలుక కోసుకున్న సంపత్ దానిని అమ్మవారికి సమర్పించాడు. అది చూసిన భక్తులు నిర్ఘాంతపోయారు. 

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆలయం వద్దకు చేరుకుని సంపత్‌ను కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం వల్ల అతడి పరిస్థితి విషమంగా మారినట్టు కౌశంబి జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ దీపక్ సేథ్ తెలిపారు. వీలైతే అతడిని ప్రయాగ్‌రాజ్‌లోని ఎస్ఆర్ఎన్ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తామన్నారు. తన ప్రార్థనలు ఫలించాలన్న ఉద్దేశంతోనే సంపత్ తన నాలుకను అమ్మవారికి సమర్పించినట్టు స్థానికులు తెలిపారు. కాగా, సంపత్-బానోదేవి దంపతులకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.

More Telugu News