Hyderabad: హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు.. జంట జలాశయాల గేట్లు ఎత్తివేత

  • గత రాత్రి రెండు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షం
  • ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్ల ఎత్తివేత
  • మూసీ పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
officials release water from osman sagar and himayat sagar

హైదరాబాద్‌లో రెండు రోజుల నుంచి అకస్మాత్తుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి రెండు గంటలపాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అంతేకాదు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు.

మరోవైపు, నగర శివారులోని జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఇవి ప్రమాదకర స్థాయికి చేరుకుంటుండడంతో ఈ రెండు జలాశయాల రెండు గేట్లను ఎత్తి మూసీనదిలోని నీటిని వదులుతున్నారు. ఈ నేపథ్యంలో మూసీ పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. హిమాయత్ సాగర్ ఇన్‌ఫ్లో 500, ఔట్‌ఫ్లో 678 క్యూసెక్కులుగా ఉండగా, ఉస్మాన్ సాగర్ ఇన్ ‌ఫ్లో 600, ఔట్‌ఫ్లో 442 క్యూసెక్కులుగా ఉన్నట్టు తెలిపారు.

More Telugu News