Amit Shah: ఆంధ్రా ఎంపీ పీఏ నంటూ అమిత్ షా భద్రతా వలయంలోకి ప్రవేశించిన వ్యక్తి

  • ముంబయిలో అమిత్ షా పర్యటన
  • బీజేపీ నేతలతో సమావేశాలు
  • ముంబయి సాగర్ బంగ్లాలో అమిత్ షా
  • అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి
  • అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
Man breaches Amit Shah security establishment

ముంబయిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రతా వలయంలోకి ప్రవేశించి అనుమానాస్పద రీతిలో కనిపించిన ఓ వ్యక్తిని ముంబయిలోని మలబార్ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారులు ప్రశ్నించగా, తాను ఓ ఆంధ్రా ఎంపీకి పీఏ నని చెప్పాడు. ధూల్ ప్రాంతానికి చెందిన ఆ 32 ఏళ్ల వ్యక్తిని హేమంత్ పవార్ గా గుర్తించారు. 

ముంబయిలో రెండ్రోజుల పర్యటన కోసం వచ్చిన అమిత్ షా మహారాష్ట్ర బీజేపీ నేతలతో కీలక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముంబయిలో డిప్యూటీ సీఎం అధికారిక నివాసం సాగర్ బంగ్లాలో ఉండగా... హేమంత్ పవార్ అక్కడికి చేరుకుని అమిత్ షా, ఇతర రాజకీయనాయకుల చుట్టూ తిరుగుతూ అధికారుల కంటబడ్డాడు. 

అతడు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రిబ్బన్ బ్యాడ్జి కూడా ధరించి ఉండడంతో అప్పటివరకు పెద్దగా ఎవరూ అతడ్ని అనుమానించలేదు. అతడి వ్యవహారాల శైలిని నిశితంగా గమనించిన అధికారులు ప్రశ్నించగా, తాను ఆంధ్రా ఎంపీ పీఏనని జవాబిచ్చాడు. 

అయితే, అతడి సమాధానంతో సంతృప్తి చెందని అధికారులు మలబార్ హిల్స్ పోలీసులకు సమాచారం అందించగా, వారు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 170 కింద కేసు నమోదు చేశారు. హేమంత్ పవార్ ను కోర్టులో ప్రవేశపెట్టగా... కోర్టు అతడికి ఐదు రోజుల రిమాండ్ విధించింది.

More Telugu News