EAMCET: తెలంగాణలో ఆ రెండు ఇంజనీరింగ్​ కోర్సుల కోసం ఎగబడ్డ విద్యార్థులు

  •  తెలంగాణ ఎంసెట్ తొలి దశ కౌన్సెలింగ్ లో సీట్ల కేటాయింపు పూర్తి
  • మంగళవారం రాత్రి ఫలితాల వెల్లడి
  • కంప్యూటర్ సైన్స్, ఐటీ విభాగాల్లో 98.49 శాతం సీట్ల భర్తీ
Computer Science and IT courses top choice for students in TS EAMCET 2022

తెలంగాణ ఎంసెట్ మొదటి దశ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన సీట్ల కేటాయింపు పూర్తయింది. మొదటి దశ అడ్మిషన్ కౌన్సెలింగ్ ఫలితాలు మంగళవారం రాత్రి వెలువడ్డాయి. ఇంజనీరింగ్ విద్యార్థులు కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత కోర్సుల వైపే మొగ్గు చూపారు. 

ఈ కోర్సుల్లో 41,506 సీట్లు ఉండగా.. దాదాపు  98.49 శాతం సీట్లు తొలి దశలోనే భర్తీ అయ్యాయి. కంప్యూటర్ సైన్స్, ఐటీ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ కోర్సుల్లో 100 శాతం సీట్లను కేటాయించారు. అదేవిధంగా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సీఎస్సీ (డేటా సైన్స్), కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహా 11 ఇతర కోర్సుల్లో 90 శాతానికి పైగా సీట్లు కేటాయింపు పూర్తయిందని అధికారులు తెలిపారు. 

ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ కోర్సులకు సంబంధించి బయోమెడికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్  ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్ విభాగాల్లో 100 శాతం సీట్లు కేటాయించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ కోర్సులో 12,219 సీట్లలో 92.13 శాతం నిండాయి. సివిల్, మెకానికల్, అనుబంధ కోర్సుల వైపు విద్యార్థులు ఆసక్తి చూపలేదు. ఈ విభాగాల్లో అందుబాటులో ఉన్న  10,181 సీట్లలో కేవలం 36.74 శాతం సీట్లు  మాత్రమే అలాట్ అయ్యాయి. తొలి దశ కౌన్సెలింగ్ లో మొత్తం 74,334 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో పాల్గొనగా, 73,195 మంది కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్లను ఎంపిక చేసుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 176 ఇంజినీరింగ్ కాలేజీల్లో మొత్తం 71,286 సీట్లు అందుబాటులో ఉండగా తొలి దశలో 60,208 (84.45 శాతం) సీట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. 12,987 మంది సీట్లు పొందలేకపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక యూనివర్సిటీ, 31 ప్రైవేట్ కాలేజీలు కలిపి మొత్తం 32 కాలేజీల్లో 100 శాతం సీట్లు కేటాయించారు. కాగా, సీటు అలాట్‌మెంట్ పొందిన అభ్యర్థులు ఈనెల 13వ తేదీలోపు ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో https://tseamcet.nic.in వెబ్‌సైట్‌లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. అక్టోబరు 17 నుంచి 21లోగా కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.

More Telugu News