Hyderabad: తనను పట్టించుకోవడం లేదని.. భర్తపై మరుగుతున్న నూనె పోసిన భార్య

  • పిల్లల చదువుల కోసం మూడున్నరేళ్ల క్రితం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు మకాం
  • వేరే మహిళతో ఉంటూ ఐదు నెలల తర్వాత ఇంటికొచ్చిన భర్త
  • భర్తతో వాగ్వివాదానికి దిగి క్షణికావేశంలో వేడివేడి నూనె పోసిన భార్య
Wife poured hot oil on her husband in Hyderabad

భర్త తనను నిర్లక్ష్యం చేయడాన్ని తట్టుకోలేకపోయిన భార్య.. కట్టుకున్న వాడిపై మరుగుతున్న నూనె పోసింది. తీవ్రంగా గాయపడిన భర్త ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడలోని సింగ్‌నగర్‌కు చెందిన గిరిధర్‌లాల్ (50) మాంసం వ్యాపారి. పిల్లల చదువుల కోసం మూడున్నరేళ్ల క్రితం భార్య రేణుక (40), కుమార్తె, ఇద్దరు కుమారులతో కలిసి హైదరాబాద్ చేరుకున్నాడు. జియాగూడ కబేళాలో పనిచేస్తూ దరియాబాగ్‌లో ఉంటున్నాడు. గత కొన్ని రోజులుగా గిరిధర్‌లాల్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. భార్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు.

పరాయి స్త్రీలపై వ్యామోహం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఐదు నెలలుగా ఓ మహిళ వద్ద ఉంటూ మూడు రోజుల క్రితమే తన వద్దకు వచ్చినట్టు రేణుక ఆరోపించింది. దీంతో భార్యాభర్తల మధ్య వాగ్వివాదం జరిగింది. నిన్న మరోమారు ఇద్దరి మధ్య ఈ విషయంలో గొడవ జరిగింది. దీంతో ఆవేశానికి గురైన రేణుక వంటింట్లోకి వెళ్లి కడాయిలో ఉన్న మరుగుతున్న నూనెను తీసుకొచ్చి భర్త తలపై పోసింది. తీవ్రంగా గాయపడిన గిరిధర్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, భర్త గిరిధర్‌పై గతంలో విజయవాడలోనూ రేణుక ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News