Rohit Sharma: నాలుగో వికెట్ కోల్పోయిన భార‌త్‌... కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శ‌ర్మ‌

  • 72 ప‌రుగులు చేసిన రోహిత్ శ‌ర్మ‌
  • 34 ప‌రుగుల‌తో రాణించిన సూర్య కుమార్ యాద‌వ్‌
  • 16 ఓవ‌ర్ల‌కు 135 ప‌రుగులు చేసిన టీమిండియా
team india scores 135 runs in 16overs against srilanka in asia cup

ఆసియా క‌ప్‌లో కీల‌క‌మైన మ్యాచ్‌లో టీమిండియా త‌డ‌బ‌డుతున్న‌ట్లుగానే క‌నిపిస్తోంది. ఆదిలో వ‌రుస‌గా రెండు కీల‌క వికెట్లు కోల్పోయిన భార‌త్‌ను జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (72) ఆదుకున్నాడు. కేఎల్ రాహుల్ (6)తో క‌లిసి జ‌ట్టు ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రోహిత్‌... అటు రాహుల్‌తో పాటు స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ (0) వికెట్లు వ‌రుస‌గా ప‌డిపోయినా ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా జ‌ట్టు స్కోరును ప‌రుగులు పెట్టించాడు. 

ఈ క్రమంలో కేవ‌లం 40 బంతుల‌ను మాత్ర‌మే ఎదుర్కొన్న రోహిత్‌... 5 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో చెల‌రేగాడు. 13వ ఓవ‌ర్ రెండో బంతికి చ‌మిక క‌రుణ‌ర‌త్నే బౌలింగ్‌లో ప‌తుమ్ నిసంకాకు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు.

ఇక రోహిత్ శ‌ర్మ‌తో క‌లిసి కీల‌క ఇన్నింగ్స్ ఆడిన సూర్య కుమార్ యాద‌వ్ (34)...రోహ‌త్ ఔటైన కాసేప‌టికే త‌న వికెట్ చేజార్చుకున్నాడు. 28 బంతుల్లో ఓ ఫోర్‌, ఓ సిక్స‌ర్‌తో ధాటిగా ఆడిన యాద‌వ్‌.. 15వ ఓవ‌ర్ రెండో బంతికి దాసున్ శ‌న‌క బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా పెవిలియ‌న్ చేరాడు. రోహిత్‌, యాద‌వ్‌లు ఔటైన త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన హార్దిక్ పాండ్యా (6), వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ (13) నిల‌క‌డ‌గా ఆడుతున్నారు. 16 ఓవ‌ర్లు ముగిసే స‌రికి భార‌త జ‌ట్టు 135 ప‌రుగులు చేసింది.

More Telugu News