Narendra Modi: తన పుట్టినరోజు సందర్భంగా అరుదైన ప్రాజెక్టు ప్రారంభించనున్న ప్రధాని మోదీ

  • సెప్టెంబరు 17న ప్రధాని మోదీ పుట్టినరోజు
  • చీటా ప్రాజెక్టుకు శ్రీకారం
  • చిరుత పులుల ఖండాంతర తరలింపునకు వేదికగా కునో నేషనల్ పార్క్
  • మోదీ పర్యటనను ఖరారుచేసిన పీఎంవో
PM Modi will inaugurates rare project of Cheetahs Translocation

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17న పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఓ అరుదైన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు. మధ్యప్రదేశ్ లోని శివ్ పూర్ జిల్లాలో కునో నేషనల్ పార్క్ వద్ద చిరుతపులుల ఖండాంతర తరలింపు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఓ ఖండంలో జీవిస్తున్న చిరుతపులులను మరో ఖండంలో ప్రవేశపెట్టడం ప్రపంచంలో ఇదే ప్రథమం. ఆఫ్రికా ఖండంలోని నమీబియా నుంచి తీసుకువచ్చిన చిరుతపులులను ఇక్కడి కునో నేషనల్ పార్క్ లో ప్రవేశపెట్టనున్నారు. 

కాగా, మోదీ పర్యటనను ఖరారు చేస్తూ ప్రధానమంత్రి కార్యాలయం మధ్యప్రదేశ్ సీఎంవోకు సమాచారం అందించింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో, అధికారులు కునో ప్రాంతంలోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు సెప్టెంబరు 14 నుంచి 20వ తేదీ వరకు ముందే బుక్ చేశారు. ఈ చీటా ప్రాజెక్టును ప్రారంభించాలంటూ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. 

ప్రధాని పర్యటనకు ఒకరోజు ముందుగా నమీబియా నుంచి చిరుతలు కునో ప్రాంతానికి చేరుకోనున్నాయి. ఈ ప్రాంతంలో తాజాగా 10 హెలీప్యాడ్ లు నిర్మించారు. దాదాపు 9 వేల కిలోమీటర్లు ప్రయాణించి నమీబియా చిరుతపులులు మధ్యప్రదేశ్ రానున్నాయి.

More Telugu News