Team India: ఆసియా కప్​ లో నేడు శ్రీలంకతో భారత్​ కు విషమ పరీక్ష

  • ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ఫైనల్ రేసులో నిలవనున్న రోహిత్ సేన
  • గత పోరులో నిరాశపరిచిన బౌలర్లు పుంజుకోవాల్సిన అవసరం
  • తుది జట్టులో కీలక మార్పులు చేయనున్న రోహిత్
India Takes Srilanka today in must win game

ఆసియా కప్‌ ‌‌‌లో పాకిస్థాన్ చేతిలో  ఓటమి తర్వాత ఒత్తిడిలో పడిపోయిన భారత్ మంగళవారం కీలక మ్యాచ్ కు సిద్ధమైంది. ఫైనల్‌‌‌‌ రేసులో నిలవాలంటే తప్పకుండా నెగ్గాల్సిన మ్యాచ్ లో శ్రీలకంతో పోటీ పడనుంది. గత మ్యాచ్ లో బ్యాటర్లు సత్తా చాటినా బౌలింగ్ వైఫల్యం వల్లే రోహిత్ సేన ఓడిపోయింది. 

పేసర్లు బుమ్రా, హర్షల్ పటేల్ తో పాటు తాజాగా రవీంద్ర జడేజా గాయం కారణంగా జట్టుకు దూరం అవ్వడంతో భారత బౌలింగ్ విభాగం బలహీనమైంది. పేస్ దళపతి ‌‌‌భువనేశ్వర్‌‌‌‌ కుమార్‌‌‌‌ ఎక్కువ  పరుగులు‌‌‌ ఇచ్చుకోవడం జట్టుపై ప్రభావం చూపింది. గ్రూప్‌‌‌‌ దశ తొలి మ్యాచ్‌‌‌‌లో పాక్‌‌‌‌పై ఒంటిచేత్తో  జట్టును గెలిపించిన స్టార్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా తేలిపోయాడు. బ్యాటింగ్ లో కూడా డకౌటై నిరాశ పరిచాడు. లెగ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ యుజ్వేంద్ర చహల్‌‌‌‌ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. గత పోరులో రిషబ్ పంత్ కూడా అంచనాలను అందుకోలేకపోయాడు.

 ఈ నేపథ్యంలో తప్పకుండా నెగ్గాల్సిన నేటి మ్యాచ్ కోసం భారత తుది జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. జడేజా స్థానంలో ఎడమ చేతి వాటం ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ తుది జట్టులోకి రానున్నాడు. అనారోగ్యం కారణంగా గత మ్యాచ్‌‌‌‌కు దూరంగా ఉన్న యువ  పేసర్‌‌‌‌ అవేశ్‌‌‌‌ ఖాన్‌‌‌‌ మూడో‌ పేసర్‌‌‌‌గా లంకపై బరిలోకి దిగే చాన్సుంది. తుది జట్టులో చోటు కోసం కీపర్లు రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌, దినేశ్‌‌‌‌ కార్తీక్‌‌‌‌ మధ్య తీవ్ర పోటీ ఉంది. 

గత మ్యాచ్ లో పంత్, దీపక్ హుడాను ఆడించగా ఇద్దరూ విఫలమయ్యారు. ఈ ఇద్దరి విషయంలో కోచ్ ద్రవిడ్‌, కెప్టెన్ రోహిత్‌ కఠిన నిర్ణయం తీసుకోనున్నారు. గత పోరులో రోహిత్‌‌‌‌, రాహుల్‌‌‌‌, కోహ్లీ ఫామ్‌‌‌‌లోకి రావడం అది పెద్ద సానుకూలాంశం. మరోవైపు భారీ ఓటమితో టోర్నీని ఆరంభించిన శ్రీలంక వరుసగా రెండు విజయాలతో ఇప్పుడు జోరు మీదుంది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్‌‌‌‌, సూపర్4లో ఆఫ్ఘనిస్థాన్ ను ఓడించింది. ఆ జట్టు బ్యాటర్లంతా సమష్టిగా ఆడుతున్నారు. లంకతో పోలిస్తే భారత్ బలంగా ఉన్నప్పటికీ అన్ని విభాగాల్లోనూ సత్తా చాటాల్సిన అవసరం ఉంది.

More Telugu News