Nellore District: నెల్లూరులో దారుణం: అత్యాచారాన్ని ప్రతిఘటించిన బాలిక నోట్లో యాసిడ్ పోసి.. ఆపై గొంతు కోసిన ఉన్మాది

  • 9వ తరగతి చదువుతున్న బాలిక
  • ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రవేశించిన నిందితుడు
  • అత్యాచారాన్ని ప్రతిఘటించిన బాలిక
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు
  • పరామర్శించిన మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
Man failed to rape minor girl pour acid into face and slit her throat

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. అత్యాచారాన్ని ప్రతిఘటించిన బాలిక నోట్లో యాసిడ్ పోసిన నిందితుడు ఆపై గొంతు కోశాడు. వెంకటాచలం మండలంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసుల కథనం ప్రకారం.. బాధిత బాలిక ఓ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. బాలికను ఇంట్లోనే ఉంచి తల్లిదండ్రులు నిన్న సాయంత్రం బయటకు వెళ్లారు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని గుర్తించిన నాగరాజు అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. అతడి నుంచి తప్పించుకున్న బాలిక వాష్‌రూములోకి వెళ్లి తలుపులు మూసే ప్రయత్నం చేసింది. తలుపులు బలంగా నెట్టి లోపలికి వెళ్లిన నిందితుడు అత్యాచారానికి యత్నించాడు. 

ఆమె మరోమారు అతడిని ప్రతిఘటించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన నాగరాజు వెంట తెచ్చిన యాసిడ్‌ను ఆమె ముఖంపైనా, నోట్లోను పోశాడు. బాధతో బాలిక పెద్దగా కేకలు వేయడంతో గొంతు కోసి పరారయ్యాడు. చుట్టుపక్కల వారు వచ్చి జరిగిన ఘాతుకాన్ని చూసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 

వారొచ్చి రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న కుమార్తెను నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని గత రాత్రి నెల్లూరు ఎస్పీ సీహెచ్ విజయరావు, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పరామర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

More Telugu News