Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై స్టింగ్ ఆపరేషన్ వీడియోను విడుదల చేసిన బీజేపీ

  • 80 శాతం కమీషన్ కేజ్రీవాల్, సిసోడియాకు వెళుతుందన్న బీజేపీ నేత సంబిత్ పాత్రా
  • ట్రేడర్లు భయపడకుండా వీడియో తీయాలంటూ పిలుపు
  • తప్పించుకునే మార్గం లేదు సిసోడియా జీ అంటూ వ్యాఖ్య
BJP releases sting operation video on Delhi liquor case says no escape for Manish Sisodia

ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి స్టింగ్ ఆపరేషన్ వీడియోను బీజేపీ సోమవారం విడుదల చేసింది. ఈ స్టింగ్ వీడియో ఈ కేసులో 12వ నిందితుడైన సన్నీ మార్వా తండ్రి కుల్విందర్ మార్వాకు సంబంధించినది. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా సీబీఐ కేసు నమోదు చేయడం తెలిసిందే. ఆయన ఇళ్లలో సోదాలు కూడా నిర్వహించింది. బీజేపీ నేత సంబిత్ పాత్రా ఈ స్కామ్ కు సంబంధించిన స్టింగ్ ఆపరేషన్ వీడియోను విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 

లిక్కర్ ట్రేడర్లు ఏ మాత్రం భయపడక్కర్లేదని ధైర్యం చెప్పారు. తాము ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఎంత కమీషన్ చెల్లిస్తున్నారో వీడియో రికార్డు చేయాలని కోరారు. ‘ఇప్పుడు మీకు తప్పించుకునే మార్గం లేదు మనీష్ జీ’ అంటూ సంబిత్ పాత్రా వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చినప్పుడు, ఎక్కడ అవినీతి ఉన్నా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే జరిగినట్టు చెప్పారు. స్టింగ్ మాస్టర్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా స్టింగ్ ఆపరేషన్ జరిగినట్టు పేర్కొన్నారు. 

‘‘కుమ్మక్కు కార్యక్రమం కింద లాభంలో 80 శాతం కేజ్రీవాల్, మనీష్ సిసోడియాకు, వారి స్నేహితుడికి వెళుతుంది. ముందు మాకు 80 శాతం కమీషన్ ఇవ్వు. మిగిలిన 20 శాతాన్ని విక్రయించుకో. మాకు అభ్యంతరం లేదు. ఇది కేజ్రీవాల్ విధానం’’ అని సంబిత్ పాత్ర ఆరోపణలు చేశారు. 

More Telugu News