Bangladesh: టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీం

  • ట్విట్టర్ ద్వారా రిటైర్మెంట్ ప్రకటించిన ముష్ఫికర్
  • వన్డేలు, టెస్టులపై దృష్టి పెట్టేందుకేనన్న వికెట్ కీపర్
  • అవకాశం వస్తే ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఆడతానని స్పష్టీకరణ
Former Bangladesh Captain Mushfiqur Rahim Announces Retirement From T20Is

బంగ్లాదేశ్ వికెట్ కీపర్, ఆ జట్టు మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీం అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో రెండు మ్యాచుల్లో బంగ్లాదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తన రిటైర్మెంట్‌ను ట్విట్టర్ ద్వారా ప్రకటించిన రహీం.. వన్డేలు, టెస్టులపై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. అయితే, అవకాశం వస్తే ఫ్రాంచైజీ క్రికెట్‌లో మాత్రం ఆడతానని పేర్కొన్నాడు. వన్డే, టెస్టుల్లో తన దేశానికి సగర్వంగా ప్రాతినిధ్యం వహించేందుకు ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు. 
 
బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ఈ ఏడాది జులైలో టీ20లకు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు ముష్ఫికర్ అదే బాటలో నడిచాడు. ఆసియా కప్‌లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ కలిపి రహీం ఐదు పరుగులు మాత్రమే చేశాడు. ఆఫ్ఘనిస్థాన్‌పై ఒకటి, శ్రీలంకపై నాలుగు పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ తరపున 102 టీ20లు ఆడిన ముష్ఫికర్ 1500 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 72 (నాటౌట్) పరుగులు.

More Telugu News