charmme kaur: అప్పటిదాకా బ్రతకండి, బ్రతకనివ్వండి అంటూ సోషల్​ మీడియాకు ఛార్మీ కౌర్​ దూరం

  • పూరీ జగన్నాథ్, ఛార్మీ నిర్మాణంలో వచ్చిన ‘లైగర్’ కు భారీ నష్టాలు
  • సినిమా విషయంలో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
  • కొన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్టు ఛార్మీ ట్వీట్
Liger Producer Charmme Kaur announces break from social media

విజయ్ దేవరకొండ- పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చిన ‘లైగర్’ చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ ప్యాన్ ఇండియా చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కథలో దమ్ములేకపోవడంతో విడుదలైన తొలి రోజు నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో, వారం రోజుల్లోనే థియేటర్ల నుంచి బయటికి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. పూరీ, ఛార్మి కౌర్, కరణ్ జోహార్ దాదాపు వంద కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం అందులో సగం కూడా రాబట్టలేదని తెలుస్తోంది. ఈ భారీ డిజాస్టర్ అటు హీరో విజయ్ తో పాటు దర్శకుడు పూరీ, సహ నిర్మాత ఛార్మీ కౌర్ ను తీవ్ర నిరాశకు గురి చేసింది.  

ప్రమోషన్స్ లో భాగంగా ‘లైగర్’ ఓ రేంజ్లో ఉంటుందని చెప్పిన చిత్ర బృందాన్ని సోషల్ మీడియాలో పలువురు ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఛార్మీ కౌర్ అనూహ్యంగా నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆమె ఓ ట్వీట్ చేసింది. ‘గయ్స్ కాస్త శాంతించండి. చిన్న బ్రేక్ తీసుకుంటున్నా.. సోషల్ మీడియా నుంచి. పూరీ కనెక్ట్స్ మరింత దృఢంగా, మెరుగ్గా మళ్లీ  తిరిగొస్తుంది. అప్పటి వరకు బ్రతకండి. బ్రతకనివ్వండి’ అంటూ హార్డ్ ఎమోజీని యాడ్ చేసి ఛార్మీ  ట్వీట్ చేసింది.

More Telugu News