Pakistan: రూ. 30 వేలు తీసుకుని భారత్‌పై దాడికి వచ్చిన పాక్ ఉగ్రవాది గుండెపోటుతో మృతి

  • రూ. 30 వేలు ఇచ్చి భారత్‌పై దాడికి పంపిన పాక్ కల్నల్ యూనుస్ చౌధరీ
  • భారత సైన్యం కాల్పుల్లో గాయపడి దొరికిపోయిన తబ్రక్
  • మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
Arrested Pak terrorist dies during treatment in Rajouri

తబ్రక్ హుస్సేన్ గుర్తున్నాడా? రూ. 30 వేలు తీసుకుని భారత జవాన్లపై దాడికి వచ్చి పట్టుబడిన తబ్రక్ నిన్న గుండెపోటుతో మరణించాడు. పాకిస్థాన్‌కు చెందిన తబ్రక్ గత నెలలో జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా నౌషేరా సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించి దొరికిపోయాడు. ముగ్గురు ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించగా భారత సైన్యం జరిపిన కాల్పుల్లో తబ్రక్ గాయపడి దొరికిపోయాడు. మిగతా ఇద్దరూ పరారవుతూ ల్యాండ్‌మైన్ పేలుడులో ప్రాణాలు కోల్పోయారు.

గాయపడిన తబ్రక్‌ను రాజౌరిలోని మిలటరీ ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో అతడు మాట్లాడుతూ.. భారత పోస్టులపై దాడిచేసేందుకు పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కల్నల్ యూనుస్ చౌధరీ తనకు 30 వేల పాకిస్థానీ రూపాయిలు ఇచ్చి పంపినట్టు తెలిపాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని సబ్జ్‌కోట్‌ గ్రామానికి చెందిన తబ్రక్ భారత్‌పై దాడి ప్రణాళికను ఈ సందర్భంగా వెల్లడించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తబ్రక్ గుండెపోటుతో నిన్న మృతి చెందినట్టు సైన్యాధికారులు తెలిపారు.

More Telugu News