AAP: విశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గిన కేజ్రీ స‌ర్కారు... బీజేపీ కుట్ర ఫెయిలైంద‌న్న ఢిల్లీ సీఎం

  • విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 59 ఓట్లు
  • ఆప్ ఎమ్మెల్యేలు నిజాయ‌తీప‌రుల‌న్న కేజ్రీవాల్‌
  • కుట్ర‌ల నుంచి ప్రభుత్వాన్ని కాపాడుకున్నార‌ని  ప్రశంస 
aap government wins confidence motion

ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్ర‌భుత్వం విశ్వాస ప‌రీక్ష‌లో విజ‌యం సాధించింది. తమ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆరోపిస్తూ, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సభలో తన బలాన్ని నిరూపించుకోవడానికి విశ్వాస పరీక్షకు సిద్ధమైన సంగతి విదితమే. ఈ క్రమంలో గురువారం స‌మావేశ‌మైన ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ స‌ర్కారు విశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఈ తీర్మానానికి ఆప్ త‌ర‌ఫున 59 మంది ఎమ్మెల్యేలు మ‌ద్ద‌తు ప‌లికారు. దీంతో విశ్వాస ప‌రీక్ష‌లో కేజ్రీవాల్ స‌ర్కారు విజ‌యం సాధించిన‌ట్లుగా స్పీకర్ ప్ర‌క‌టించారు.

ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 సీట్లు ఉండ‌గా... గ‌డ‌చిన ఎన్నికల్లో అటు కాంగ్రెస్‌తో పాటు ఇటు బీజేపీని చిత్తు చేసిన ఆప్ ఏకంగా 62 స్థానాలను గెలుచుకుంది. వీరిలో ఇద్ద‌రు విదేశాల్లో ఉండ‌గా... స్పీక‌ర్ స్థానంలో ఉన్న స‌భ్యురాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. వెర‌సి ఆప్ త‌ర‌ఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన వారంతా కేజ్రీవాల్ స‌ర్కారుకు మ‌ద్ద‌తుగా నిలిచి త‌మ పార్టీ ప్ర‌భుత్వాన్ని విశ్వాస ప‌రీక్ష‌లో గెలిపించుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ ఇత‌ర రాష్ట్రాల మాదిరిగానే ఢిల్లీలోనూ ఆప్ స‌ర్కారును కూల్చేందుకు బీజేపీ కుట్ర చేసింద‌ని ఆరోపించారు. అయితే బీజేపీ కుట్ర‌లు ఢిల్లీలో విఫ‌ల‌మ‌య్యాయ‌ని ఆయ‌న అన్నారు. ఆప్ ఎమ్మెల్యేలు నిజాయ‌తీప‌రుల‌న్న కేజ్రీ... వారి ప్రభుత్వాన్ని వారే కుట్ర‌ల నుంచి కాపాడుకున్నార‌ని కితాబిచ్చారు.

More Telugu News