Mega Star: స్మార్ట్‌ఫోన్లు, ఓటీటీలు ఎన్ని వచ్చినా కంటెంట్ ఉంటే జనం థియేటర్లకు వస్తారు: మెగాస్టార్ చిరంజీవి

  • రేపు ప్రేక్షకుల ముందుకు ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’
  • ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి
  • కంటెంట్ లేకుంటే రెండో రోజే సినిమా మాయమవుతుందన్న మెగాస్టార్
  • మంచి కథలు ఎంచుకోవాలని డైరెక్టర్లకు సూచన
Choose best content megastar chiranjeevi advise to directors

స్మార్ట్‌ఫోన్లు, ఓటీటీలు ఎన్ని వచ్చినా కంటెంట్ ఉంటే జనం థియేటర్లకు వస్తారని ‘బింబిసార’, ‘సీతారామం’, 'కార్తికేయ2’ సినిమాలు నిరూపించాయని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా 'శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్' బ్యానర్‌లో నిర్మించిన సినిమా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ అయిన ఈ సినిమా రేపు (సెప్టెంబరు 2న) విడుదల కానుంది. ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సక్సెస్ రేటు అప్పుడు, ఇప్పుడు ఒకేలా ఉందని అన్నారు. సరైన కంటెంట్‌తో సినిమాలు ఇవ్వగలిగితే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని అన్నారు. సినిమాలో కంటెంట్ లేకుంటే రెండో రోజే కనుమరుగైపోతుందని పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో అలాంటి బాధితుల్లో తాను కూడా ఒకడిని అయ్యానని గుర్తు చేసుకున్నారు.

ప్రేక్షకులకు ఏది అవసరం అనే విషయాన్ని డైరెక్టర్లు గమనించాలని సూచించారు. డేట్స్ క్లాష్ అవుతాయని షూటింగ్స్ విషయంలో కంగారు వద్దని అన్నారు. తమపై ఎంతోమంది ఆధారపడి ఉన్నారన్న విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు. కంటెంట్ విషయంలో డైరెక్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. అలా ఆలోచించిన రోజున ఇండస్ట్రీకి మరిన్ని హిట్స్ వస్తాయని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు.

More Telugu News