Uttar Pradesh: ఐదో పెళ్లికి రెడీ అయిన తండ్రి.. దాడిచేసి చావగొట్టిన పిల్లలు.. పెళ్లిపీటల పైనుంచి వధువు పరార్!

  • ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో ఘటన
  • రెండో వివాహంలో ఏడుగురు సంతానం
  • కల్యాణ మండపంలోనే తండ్రికి దేహశుద్ధి చేసిన కుమారులు
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు
father of 7 children was going to become a groom for the 5th time

నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నా అతడు తృప్తి చెందలేదు. ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడు. వరుడిలా చక్కగా ముస్తాబయ్యాడు. కాసేపైతే వధువు మెడలో తాళి కట్టేవాడే. అప్పుడే అతడి కుమారులు సీన్‌లోకి ఎంటరయ్యారు. పెళ్లి కొడుకులా ముస్తాబైన తండ్రిని పట్టుకుని చావగొట్టారు. దీంతో కల్యాణ మండపంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇది చూసి వధువు అక్కడి నుంచి చడీచప్పుడు కాకుండా జారుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో జరిగిందీ ఘటన. 

పోలీసుల కథనం ప్రకారం.. ఐదో పెళ్లికి సిద్ధమైన ఆ వ్యక్తికి 55 ఏళ్లు. యూపీలోని మొహల్లా పటియాకు చెందిన అతడు రోడ్డు కాంట్రాక్టర్. మొదటి భార్యకు విడాకులిచ్చి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో అతడు ఏడుగురు పిల్లల్ని కన్నాడు. గత ఆరు నెలలుగా ఆమెకు దూరంగా ఉంటున్న నిత్య పెళ్లికొడుకు ఇటీవల విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత రహస్యంగా మరో రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. పెళ్లిళ్లపై ఆశ చావకపోవడంతో రహస్యంగా మరో వివాహానికి సిద్ధమయ్యాడు. మంగళవారం రాత్రి ముహూర్తం కూడా సిద్ధమైంది.

ఈ విషయం రెండో భార్య, ఆమె పిల్లలకు తెలియడంతో బంధువులతో కలిసి కల్యాణ మండపానికి చేరుకున్నారు. వరుడిలా అలంకరించుకుని పెళ్లి పీటల మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తండ్రిని చూడగానే వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తండ్రిని పట్టుకున్న పిల్లలు అతడిని చావబాదారు. దీంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. ఏం జరుగుతుందో అర్థమైన తర్వాత వధువు అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా పరారైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిత్య పెళ్లికొడుకును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News