Raviteja: మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ!

  • 'క్రాక్' తరువాత హిట్ లేని రవితేజ 
  • రిలీజ్ కి రెడీ అవుతున్న 'ధమాకా'
  • లైన్లో మరో రెండు ప్రాజెక్టులు 
  • కొత్తగా కార్తీక్ ఘట్టమనేనికి ఛాన్స్ 
Raviteja in Karthik Ghattamaneni Movie

'క్రాక్' తరువాత రవితేజ నుంచి వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డాయి. ఈ రెండు సినిమాల విషయంలో రవితేజ అభిమానులు చాలా అసంతృప్తికి లోనయ్యారు. ఆ తరువాత సినిమాగా ఆయన నుంచి 'ధమాకా' రానుంది. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా శ్రీలీల అలరించనుంది.

ఈ సినిమా తరువాత రవితేజ 'రావణాసుర' .. ' టైగర్ నాగేశ్వరరావు' ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. ఈ రెండు సినిమాలు కూడా సెట్స్ పైనే ఉన్నాయి. ఆ తరువాత ప్రాజెక్టును ఆయన తాజాగా సెట్ చేశాడనే టాక్ వినిపిస్తోంది. ఆ దర్శకుడు ఎవరో కాదు .. కార్తీక్ ఘట్టమనేని.  సినిమాటోగ్రఫర్ గా .. ఎడిటర్ గా కార్తీక్ ఘట్టమనేనికి మంచి అనుభవం ఉంది.

 2015లోనే ఆయన నిఖిల్ హీరోగా 'సూర్య వర్సెస్ సూర్య' సినిమాను రూపొందించాడు. అయితే ఆ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తరువాత దర్శకుడిగా ఆయన చేయనున్న సినిమా ఇదే. రవితేజ 'డిస్కోరాజా' సినిమాకి సినిమాటోగ్రఫర్ గా పనిచేసిన కార్తీక్ ఘట్టమనేని, ఆయన సినిమానే  డైరెక్ట్ చేయనుండటం విశేషం. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రూపొందనున్న ఈ సినిమా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మితమవుతుందని సమాచారం.

More Telugu News