Megastar: మహిళకు సినిమా చూపిస్తూ ‘గాంధీ’ వైద్యుల ఆపరేషన్.. త్వరలోనే ఆసుపత్రికి వస్తానన్న మెగాస్టార్ చిరంజీవి

  • ‘అడవి దొంగ’ సినిమా చూస్తూ ఆపరేషన్ చేయించుకున్న మహిళ
  • పీఆర్వోను ఆసుపత్రికి పంపిన చిరంజీవి
  • వైద్యులను పరిచయం చేసిన సూపరింటెండెంట్ రాజారావు
  • తాను చిరంజీవి అభిమానినన్న మహిళ
  • రెండుమూడు రోజుల్లో వీలు చూసుకుని ఆసుపత్రికి వస్తానన్న చిరంజీవి
megastar chiranjeevi to visit gandhi hospital

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి వైద్యులు రెండు రోజుల క్రితం ఓ మహిళకు సినిమా చూపిస్తూ ఆమెను స్పృహలోనే ఉంచి అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేశారు. ఆమె మెదడులోని కణతిని తొలగించారు. ఆపరేషన్ జరుగుతున్నంత సేపు ఆమె చిరంజీవి నటించిన ‘అడవి దొంగ’ సినిమా చూశారు. ఆపరేషన్ చేస్తున్న వైద్యులు మధ్యమధ్యలో ఆమెతో మాటలు కలుపుతూ విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు.

విషయం తెలిసిన చిరంజీవి వెంటనే స్పందించారు. వివరాలు తెలుసుకోమంటూ నిన్న తన పీఆర్వో ఆనంద్‌ను ఆసుపత్రికి పంపారు. ఆయన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావును కలిశారు. ఈ సందర్భంగా మహిళకు శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులను ఆయన పరిచయం చేశారు. అనంతరం ఆనంద్ ఆపరేషన్ చేయించుకున్న మహిళను కలిసి మాట్లాడారు.

తాను చిరంజీవి అభిమానినని, ఆయన సినిమాలను క్రమం తప్పకుండా చూస్తానని ఆమె చెప్పారు. అనంతరం ఆనంద్ అక్కడి నుంచే చిరంజీవికి ఫోన్ చేసి విషయం చెప్పారు. చిరు స్పందిస్తూ.. వీలు చూసుకుని రెండుమూడు రోజుల్లో ఆసుపత్రికి వస్తానని చెప్పడంతో ఆ విషయాన్ని ఆనంద్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుకు చెప్పారు.

More Telugu News