Political Parties: గుప్త విరాళాలు బీజేపీ కంటే కాంగ్రెస్‌కే అధికం... ప్రాంతీయ పార్టీల్లో టాప్‌లో వైసీపీ

  • గుప్త నిధులుగా పార్టీలు అందుకున్న విరాళాల విలువ రూ.15,077 కోట్లు
  • వీటిలో గ‌తేడాది మాత్ర‌మే అందిన విరాళాలు రూ. 690.67 కోట్లు
  • బీజేపీకి రూ.100.50 కోట్లు అందితే... కాంగ్రెస్‌కు రూ.178.78 కోట్లు అందిన వైనం
  • రూ.96.25 కోట్ల‌తో ప్రాంతీయ పార్టీల్లో అగ్ర‌స్థానంలో నిలిచిన వైసీపీ
  • ఆప్‌కు గుప్త నిధుల ద్వారా అందిన మొత్తం రూ.5.4 కోట్లు
ysrcp tops regional parties list in latent donations

దేశంలో రాజ‌కీయ పార్టీల‌కు అందుతున్న విరాళాల్లో మెజారిటీ విరాళాలు గుర్తు తెలియ‌ని మూలాల (గుప్త‌) నుంచి వ‌స్తున్న‌వే. విరాళాలు ఎక్క‌డి నుంచి వచ్చాయ‌న్న వివ‌రాల‌ను ఆయా రాజ‌కీయ పార్టీలు వెల్ల‌డించ‌కున్నా... ఏ మేర వ‌చ్చాయ‌న్న విష‌యాన్ని మాత్రం వెల్ల‌డించ‌క త‌ప్ప‌దు. అన్ని మార్గాల్లో ఆయా రాజ‌కీయ పార్టీల‌కు వ‌చ్చిన విరాళాల వివ‌రాల‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఏటా విడుద‌ల చేస్తూనే ఉంటుంది. ఆ విరాళాలపై అసోసియేష‌న్ ఫ‌ర్ డెమొక్ర‌టిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్‌) సంస్థ ఏటా విశ్లేషిస్తూనే ఉంటుంది.

తాజాగా 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రానికి ఆయా పార్టీల‌కు వ‌చ్చిన విరాళాల మీద ఏడీఆర్ శుక్ర‌వారం ఓ నివేదిక‌ను విడుద‌ల చేసింది. ఈ నివేదిక ప్ర‌కారం రాజ‌కీయ పార్టీల‌కు 2004-05 నుంచి 2020-21 మ‌ధ్య కాలంలో గుర్తు తెలియ‌ని మూలాల నుంచి ఏకంగా రూ.15,077 కోట్లు అందాయి. వీటిలో 2020-21 ఒక్క ఏడాదిలోనే ఈ త‌ర‌హా నిధుల‌ను జాతీయ, ప్రాంతీయ పార్టీలు రూ.690.67 కోట్లు అందుకున్నాయి. ఈ నిధులు అందుకున్న పార్టీల్లో 8 జాతీయ పార్టీలు కాగా... 27 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. 

ఇక వీటిలో 8 జాతీయ పార్టీల‌కు అందిన మొత్తం రూ.426.74 కోట్లు కాగా... 27 ప్రాంతీయ పార్టీల‌కు 263.92 కోట్లు అందాయి. జాతీయ పార్టీల్లో అధికార పార్టీగా ఉన్న బీజేపీకి ఈ త‌ర‌హా నిధుల్లో రూ.100.50 కోట్లు అంద‌గా... విప‌క్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు దాని కంటే అధికంగా రూ.178.78 కోట్లు అందాయ‌ట‌. 

ఇక గుప్త విరాళాలు అందుకున్న ప్రాంతీయ పార్టీల విష‌యానికి వ‌స్తే... ఈ విరాళాలు అందుకున్న పార్టీల సంఖ్య 27గా ఉన్నా... వాటిలో 5 పార్టీల‌కే మెజారిటీ నిధులు అందిన‌ట్లు ఏడీఆర్ నివేదిక తెలిపింది. ఇలాంటి నిధుల‌ను అత్య‌ధికంగా అందుకున్న పార్టీగా... ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నిలిచింది. ఈ పార్టీ గ‌తేడాది గుప్త విరాళాలుగా 96.25 కోట్ల‌ను అందుకుంది. ఆ త‌ర్వాత త‌మిళ‌నాడులోని అధికార పార్టీ డీఎంకే రూ.80.02 కోట్ల‌తో రెండో స్థానంలో ఉంది. త‌ర్వాతి స్థానంలో రూ.67 కోట్ల‌తో బీజేడీ మూడో స్థానంలో నిల‌వ‌గా. రూ.5.77 కోట్ల‌తో ఎంఎన్ఎస్‌, రూ.5.4 కోట్ల‌తో ఆప్ నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి.

More Telugu News