Asaduddin Owaisi: రాజాసింగ్ జైలుకు వెళ్లాల్సిందే: ఒవైసీ

  • మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ వ్యాఖ్యలు
  • స్పందించిన ఎంఐఎం అధినేత
  • ప్రవక్త ముస్లింల హృదయాల్లో ఉన్నాడని వెల్లడి
  • రాజాసింగ్ ను కస్టడీలోకి తీసుకోవాలన్న ఒవైసీ
  • అప్పటివరకు నిరసనలు కొనసాగుతాయని స్పష్టీకరణ
Owaisi slams Raja Singh for his derogatory remarks on prophet

మహ్మద్ ప్రవక్తను కించపరిచే వ్యాఖ్యలతో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేశాడని, అందులో తమ విద్వేషాన్ని వెళ్లగక్కాడని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. మహ్మద్ ప్రవక్త ముస్లింల హృదయాల్లో కొలువై ఉన్నాడని, అవమానకర వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేని అరెస్ట్ చేసేంతవరకు తమ నిరసన ప్రదర్శనలు కొనసాగుతాయని అన్నారు. 

అతడిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని, అతడు జైలుకు వెళ్లాల్సిందేనని ఉద్ఘాటించారు. రాజాసింగ్ ను పోలీస్ కస్టడీకి పంపి, అతడి వాయిస్ శాంపిల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరీక్ష చేయించాలని తెలిపారు. అతడి చెత్తవాగుడుకు ఇదే ఆఖరు కావాలని అన్నారు. 

అటు, ఎంఐఎం పార్టీ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి లేఖ రాసింది. దైవదూషణ చేసిన గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ ను అసెంబ్లీ నుంచి తొలగించాలని కోరింది. అతడు ఎంతమాత్రం శాసనసభ్యుడిగా కొనసాగజాలడని ఎంఐఎం పేర్కొంది.

More Telugu News