Hydrogen Bus: భారత రోడ్లపై పరుగులు తీసేందుకు సిద్ధమైన తొలి దేశీయ హైడ్రోజన్ ఆధారిత బస్సు

  • ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యం
  • వాతావరణంపై తీవ్ర ప్రభావం
  • భారత్ లో పర్యావరణంపై ప్రత్యేక దృష్టి
  • హైడ్రోజన్ బస్సు తయారుచేసిన సీఎస్ఐఆర్, కేపీఐటీ లిమిటెడ్
India first Hydrogen fuel cell bus unveiled

కాలుష్యం పెరిగిపోతుండడం, ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావం వివిధ రూపాల్లో దర్శనమిస్తుండడం తెలిసిందే. అందుకే, పర్యావరణ హిత వాహనాలపై అనేక దేశాలు దృష్టి సారిస్తున్నాయి. భారత్ లోనూ ఈ దిశగా పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా, దేశీయంగా తయారైన తొలి హైడ్రోజన్ బస్సు రోడ్లపై పరుగులు తీసేందుకు సిద్ధమైంది. హైడ్రోజన్ ను ఇంధనంగా ఉపయోగించుకుని నడిచే ఈ నెక్ట్స్ జనరేషన్ బస్సును కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ పూణేలో ఆవిష్కరించారు. 

ఈ బస్సును కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), కేపీఐటీ లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ బస్సులోని ఫ్యూయల్ సెల్ హైడ్రోజన్ ను, గాలిని క్రమపద్ధతిలో వినియోగించుకోవడం ద్వారా విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఆ శక్తిని బస్సుకు అందిస్తుంది. ఈ ప్రక్రియలో ఎక్కడా కాలుష్యానికి తావు ఉండదు. 

డీజిల్ బస్సు ఏడాదికి 100 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ను గాలిలోకి విడుదల చేస్తుంది. డీజిల్ తో నడిచే బస్సులు దేశంలో లక్షల సంఖ్యలో ఉన్నాయి. అలాంటి డీజిల్ బస్సులతో పోల్చితే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ తో నడిచే బస్సుల తయారీ వ్యయం చాలా తక్కువ అని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఈ హైడ్రోజన్ ఆధారిత బస్సులు దేశంలో విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతాయని పేర్కొన్నారు.

More Telugu News