Hyderabad: తన మాజీ ప్రేయసిని తనపైకి రెచ్చగొడుతున్నాడన్న కోపంతో.. యువకుడి హత్య!

  • హైదరాబాద్ శివారులోని చాంద్రాయణగుట్టలో ఘటన
  • ఫోన్ చేసి పిలిపించి కిరాతకంగా హత్య
  • ఆపై నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగుబాటు
Young Man killed another man for loving his ex girl friend

తన మాజీ ప్రేయసిని ప్రేమిస్తున్నాడని తెలిసి ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. అతడిని కిరాతకంగా చంపేశాడు. హైదరాబాద్ శివారులోని చాంద్రాయణగుట్టలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. సలాలా ప్రాంతానికి చెందిన అబ్దుల్ రహమాన్ బాక్రా (24) రియల్ ఎస్టేట్ వ్యాపారి. మసీదులో నమాజులు కూడా చదివిస్తుంటాడు. పాతబస్తీలో నివసించే అరబ్ యువతిని ప్రేమించాడు. కొన్నాళ్లకు ఇద్దరూ దూరమయ్యారు. ఆ తర్వాత ఆ యువతి సలాలా ప్రాంతానికే చెందిన ట్రావెల్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు అయిన షేక్ అబూబాకర్ అమూదీ (24)ని ప్రేమించింది. అతడికి మరో యువతితో వివాహం నిశ్చయమైనా యువతితో ప్రేమ కొనసాగించాడు.

ఈ విషయం తెలిసిన యువతి తనను పెళ్లి చేసుకోవాలంటూ మాజీ ప్రియుడు అబ్దుల్ రహమాన్‌ను కోరడమే కాకుండా ఒత్తిడి కూడా తీసుకొచ్చింది. ఇది రహమాన్‌కు కోపం తెప్పించింది. అమూదీనే ఆమెను తనపైకి ఉసిగొల్పాడని అనుమానించి కోపంతో రగలిపోయాడు. తన మాజీ ప్రేయసిని ప్రేమించి, ఆపై మరో యువతితో నిశ్చితార్థం చేసుకోవడమే కాకుండా అరబ్ యువతిని తిరిగి తనకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడని రహమాన్ అనుమానించాడు. 

అక్కడితో ఆగక అమూదీని హత్య చేయాలని పథకం రచించాడు. మాట్లాడుకుందామని రమ్మని శనివారం అమూదీకి ఫోన్ చేశాడు. అర్ధ రాత్రి దాటిన తర్వాత కారులో వచ్చిన అమూదీని రహమాన్ తన బంధువు ఇంటికి తీసుకెళ్లి కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు. అనంతరం అక్కడి నుంచే నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News