Telangana: అమిత్ షాతో రామోజీ రావు భేటీ

  • మునుగోడు స‌భ కోసం తెలంగాణ వ‌చ్చిన అమిత్ షా
  • తిరుగు ప్ర‌యాణంలో రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లిన బీజేపీ నేత‌
  • అమిత్ షాకు ఘ‌న స్వాగ‌తం ప‌లికిన రామోజీరావు
amit shah meets ramoji rao in ramoji film city

మునుగోడు స‌భ‌కు హాజ‌ర‌య్యేందుకు ఆదివారం తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన బీజేపీ అగ్ర నేత‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా... స‌భ ముగిసిన త‌ర్వాత రామోజీ గ్రూపు సంస్థ‌ల అధినేత చెరుకూరి రామోజీరావుతో భేటీ అయ్యారు. మునుగోడులో బీజేపీ స‌భ ముగిసిన త‌ర్వాత హైద‌రాబాద్‌కు తిరుగు ప్ర‌యాణంలో భాగంగా అమిత్ షా న‌గ‌ర శివారులోని రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా అమిత్ షాకు రామోజీరావు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

అనంత‌రం ఫిల్మ్ సిటీలోని హోట‌ల్‌కు వెళ్లిన అమిత్ షా, రామోజీరావులు ఏకాంతంగా భేటీ అయ్యారు. అమిత్ షా వెంట కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి స‌హా ప‌లువురు నేత‌లు ఉన్నా... అమిత్ షా, రామోజీరావుల భేటీలో వారెవ‌రూ పాల్గొన‌లేదు. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే ముగిసిన ఈ భేటీలో అమిత్ షా, రామోజీరావుల మ‌ధ్య ప‌లు అంశాల‌పై చ‌ర్చ జ‌రిగిన‌ట్టు స‌మాచారం.

వీరి భేటీపై అమిత్ షా ట్వీట్ చేశారు. "శ్రీ రామోజీరావు గారి జీవిత ప్రయాణం అపురూపమైనది. వారు చలనచిత్ర పరిశ్రమకు, మీడియాకు సంబంధించిన లక్షలాది మందికి స్ఫూర్తిదాయకం. ఈరోజు ఆయనను హైదరాబాద్‌లోని తన నివాసంలో కలిశాను" అని తన ట్వీట్ లో అమిత్ షా పేర్కొన్నారు 


More Telugu News