Telangana: ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో కేసీఆర్ ఫ్యామిలీకి లింకు ఉంది: బీజేపీ ఎంపీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌

  • ఢిల్లీ ఎల్ 1 లైసెన్స్ హోల్డ‌ర్స్‌, కేసీఆర్ కుటుంబ సభ్యులు లిక్కర్ పాలసీ రూపొందించారన్న బీజేపీ ఎంపీ
  • తొలి విడ‌త‌లో మ‌నీశ్‌కు రూ.150 కోట్లు ముట్ట‌జెప్పార‌ని ఆరోప‌ణ‌
  • కేసీఆర్ కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలోనే ఢిల్లీ లిక్క‌ర్ పాల‌సీ రూపొందింద‌ని వెల్ల‌డి
  • కేసీఆర్ కుటుంబంతో భేటీపై సిసోడియానే స్పందించాల‌న్న సాహిబ్ సింగ్‌
bjp mp Parvesh Sahib Singh Verma sensational allegations on kcr family

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యులపై బీజేపీ నేత‌, ప‌శ్చిమ ఢిల్లీ ఎంపీ ప‌ర్వేశ్ సాహిబ్ సింగ్ వ‌ర్మ ఆదివారం సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్క‌ర్ స్కాంలో కేసీఆర్ కుటుంబ స‌భ్యుల హ‌స్తం ఉంద‌ని ఆయ‌న ఆరోపించారు. ఢిల్లీ లిక్క‌ర్ పాల‌సీ కూడా కేసీఆర్ కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలోనే రూపొందింద‌ని కూడా ఆయ‌న కీల‌క ఆరోప‌ణ చేశారు. ఢిల్లీలోని ఒబెరాయ్ హోట‌ల్లో ఢిల్లీ లిక్క‌ర్ పాల‌సీ రూపొందింద‌ని ఆయ‌న ఆరోపించారు. ఢిల్లీ ఎక్సైజ్ క‌మిష‌న‌ర్‌, ఢిల్లీ డిప్యూటీ సీఎం, లిక్క‌ర్ మాఫియా, ఎక్సైజ్ అధికారులు, కేసీఆర్ కుటుంబీకులు ఈ డీల్‌లో ఉన్నార‌ని ఆయ‌న ఆరోపించారు. 

కేసీఆర్ కుటుంబ స‌భ్యులు ఓ ప్రైవేట్ విమానంలో ఢిల్లీ వ‌చ్చేవార‌న్న సాహిబ్ సింగ్‌.. తెలంగాణ‌లోని మ‌ద్యం మాఫియాకు చెందిన ఓ వ్య‌క్తి ఈ విమానాన్ని ఏర్పాటు చేసేవార‌ని తెలిపారు. ఒబెరాయ్ హోట‌ల్లో ఆ వ్య‌క్తే సూట్ రూమ్ బుక్ చేశార‌న్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియాల‌తో క‌లిసి కేసీఆర్ కుటుంబ సభ్యులు లిక్క‌ర్ పాల‌సీకి రూప‌క‌ల్ప‌న చేశార‌న్నారు. ఢిల్లీలో అమ‌లు అవుతున్న లిక్క‌ర్ పాల‌సీ తెలంగాణ స‌హా పంజాబ్‌, ప‌శ్చిమ బెంగాల్‌లోనూ అమ‌లు అవుతోంద‌ని ఆయ‌న ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ స‌భ్యులు, ఢిల్లీ ఎల్ 1 లైసెన్స్ హోల్డ‌ర్స్‌ లిక్కర్ పాలసీ రూపొందించారని తెలిపారు. 

ఢిల్లీలో లిక్క‌ర్ వ్యాపారం కోసం కేసీఆర్ కుటుంబ స‌భ్యులు న‌గ‌రంలో త‌మ వ్య‌క్తుల‌ను ఏర్పాటు చేసుకున్నార‌ని సాహిబ్ ఆరోపించారు. లిక్క‌ర్ స్కాంలో భాగంగా ఫ‌స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ కింద మ‌నీశ్ సిసోడియాకు రూ.150 కోట్లు అందాయ‌ని తెలిపారు. దీనికి బ‌దులుగానే ఎల్ 1 క‌మిష‌న్‌కు ముందుగా లాభాలు ముట్ట‌జెప్పి... ఆ త‌ర్వాతే మీరు లాభాలు తీసుకోవాల‌ని కేసీఆర్ ఫ్యామిలీ ఒప్పందం కుదుర్చుకుంద‌ని ఆయ‌న ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ స‌భ్యుల‌తో స‌మావేశామ‌య్యారా?  లేదా? అన్న‌ది మ‌నీశ్ సిసోడియానే వెల్ల‌డించాల‌ని సాహిబ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఇదే వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత కూడా కీలక ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితే కీలక భూమిక పోషించారని కాంగ్రెస్ నేత మరింత మేర సంచలన ఆరోపణలు చేశారు.

More Telugu News