Etela Rajender: మునుగడు సభలో కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన ఈటల రాజేందర్

  • మునుగోడు ప్రజలు కోమటి రెడ్డి వెంటే ఉన్నారు
  • కేసీఆర్ కు కమ్యూనిస్టులు మద్దతు పలకడం సిగ్గుచేటు
  • కేసీఆర్ ను ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారు
Etela Rajender fires on KCR in Munugode rally

తన చిరకాల మిత్రుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజలు ఇచ్చిన ధైర్యంతో... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కేసీఆర్ పాలనపై సమరశంఖం మోగించారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మునుగోడు ప్రజలు కూడా రాజగోపాల్ వెంటే ఉన్నారని... హుజూరాబాద్ లో బీజేపీని గెలిపించిన దానికంటే పెద్ద మెజార్టీతో రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తామని అంటున్నారని చెప్పారు. 

కేసీఆర్ ది శాడిస్టిక్ మెంటాల్టీ అని... అందుకే ఈరోజు మునుగోడులో అమిత్ షా సభ ఉంటే... నిన్న హడావుడిగా కేసీఆర్ సభ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో అత్యధిక ప్రజల ప్రేమను పొందిన నేత ప్రధాని మోదీ అని... అలాంటి మోదీని బంగాళాఖాతంలో ముంచేస్తామని కేసీఆర్ అన్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను బంగాళాఖాతంలో ముంచేస్తారని అన్నారు. 


ఇదే సమయంలో కమ్యూనిస్టు నేతలపై ఈటల మండిపడ్డారు. కేసీఆర్ కు కమ్యూనిస్టులు మద్దతు పలికిన విషయం తెలిసిందే. దీనిపై ఈటల స్పందిస్తూ... గత ఎనిమిదన్నరేళ్లుగా కమ్యూనిస్టు పార్టీలను కేసీఆర్ పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. ఏనాడైనా మీరు ప్రగతి భవన్ లోకి అడుగుపెట్టారా అని అడిగారు. కేసీఆర్ కు మీరు మద్దతు పలకడం సిగ్గు చేటని అన్నారు. కమ్యూనిస్టుల పేపర్ మన తెలంగాణను కేసీఆర్ ఆక్రమించుకున్నారని చెప్పారు. ఈరోజు కమ్యూనిస్టులకు కేసీఆర్ శాంతికాముకుడిగా కనిపిస్తున్నాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తో అంటకాగేవారిని ప్రజలు క్షమించరని అన్నారు.

మునుగోడులో రాజగోపాల్ రెడ్డి విజయం ఖరారయిందని ఈటల అన్నారు. రాజగోపాల్ ను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. హుజూరాబాద్ కంటే ముగుగోడు గడ్డ చాలా చైతన్యవంతమైనదని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పోవాలనేదే తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని చెప్పారు. 

బీజేపీ గెలిస్తే వ్యవసాయానికి మీటర్లు పెడతారని కేసీఆర్ జనాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని... దేశంలో ఎక్కడా కేంద్ర ప్రభుత్వం మీటర్లను పెట్టించలేదనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఈటల అన్నారు. కేసీఆర్ నిరాశ, నిస్పృహలతో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

More Telugu News