KCR: మోదీ దోస్తులు సూట్​ కేసులు పట్టుకుని రెడీగా ఉన్నారు: సీఎం కేసీఆర్​

  • వ్యవసాయాన్ని కార్పొరేట్ల పరం చేసేందుకు కేంద్రం కుట్ర అని ఆరోపణ
  • అందుకే వ్యవసాయానికి మీటర్లు పెట్టాలంటూ ఒత్తిడి చేస్తోందన్న సీఎం
  • దేశంలో పేదలను కొట్టి తీసుకెళ్లి పెద్దలకు పెట్టే పని జరుగుతోందని మండిపాటు
Cm KCR speech at Munugodu rally

దేశంలో వ్యవసాయాన్ని కార్పొరేట్ల పరం చేసే కుట్ర జరుగుతోందని మునుగోడు బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఆరోపించారు. వ్యవసాయానికి మీటర్లు పెట్టాలని ఒత్తిడి తెస్తున్నారని.. ఎరువుల ధరలు పెంచుతున్నారని పేర్కొన్నారు. రైతులు, పేదలకు వివిధ పథకాల కింద డబ్బులు ఎందుకు ఇస్తున్నారని కేంద్ర మంత్రి ఒకరు తమతో అన్నారని వెల్లడించారు.

అన్నింటినీ అమ్మేస్తున్నారు..
‘‘ప్రజలు ఒక్క మాట బాగా గమనించాలి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి ఎనిమిదేళ్లు అయింది. ఒక్క మంచి పని అయినా జరిగిందా? ఎవరికి జరిగింది. దళితులు, గిరిజనులు, మహిళలు, కార్మికులు, రైతులు.. ఎవరికి మేలు జరిగింది? కనీసం ఒక్కటైనా మంచి పని లేదు. మరి ఏం చేస్తున్నారు? పైగా విమానాశ్రయాలు, రైళ్లు, బ్యాంకులు, గ్యాస్ కంపెనీలు, రోడ్లు.. ఇలా అన్నింటినీ అమ్మేయడం మొదలుపెట్టారు” అని కేసీఆర్ మండిపడ్డారు.

రైతుల నోట్లో మట్టి కొట్టే యత్నం

‘‘ఇప్పుడు రైతులు, భూములు, వ్యవసాయ పంటలపై పడుతున్నారు. రైతులకు, రైతు కూలీలకు నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం జరుగుతోంది. వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెస్తోంది. కానీ నేను చచ్చినా వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టబోనని తేల్చి చెప్పాను. మీటర్లు పెట్టడం ఒక్కటే కాదు.. దీని వెనుక చాలా మతలబు ఉంది.

ఎరువుల ధరలు పెంచాలి, కరెంటు ధర పెంచాలి, పండిన పంటలు కొనొద్దు.. రైతులు ఇక తాము వ్యవసాయం చేయలేమని చాలించుకోవాలి. ఇలా ఉంది కేంద్ర ప్రభుత్వ విధానం. రైతులు వ్యవసాయం చేయలేమంటే.. మోదీ దోస్తులు సూట్ కేసులు పట్టుకుని రెడీగా ఉన్నారు. మీ భూములు మాకు ఇచ్చేయండి. కార్పొరేట్ వ్యవసాయం పెడదాం. మీరు మా వద్దే కూలీలుగా పనిచేయండి.. ఇదే వారి కుట్ర. అంతా దీనిని గమనించాలి” అని కేసీఆర్ సూచించారు.

పేదలకు డబ్బులెందుకు ఇస్తున్నారని అడిగారు
‘‘కేంద్రం రాష్ట్రంలో రైతుల ధాన్యం కొనబోమంటే మేం ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశాం. అయినా వడ్లు మేం కొనబోం అన్నారు. మేం గట్టిగా అడిగితే ‘మై క్యార్నా’ అన్నారు. మీడియా వాళ్లు లేని సమయం చూసి తలుపులు పెట్టి మాట్లాడారు. ఎందుకు మీరు డబ్బులన్నీ వృధా చేస్తున్నారని మమ్మల్ని అడిగారు. రైతులకు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు, రెండు వేల రూపాయల పెన్షన్లు ఎందుకు ఇస్తున్నారని అడిగారు. పేదలకు పెన్షన్లు ఇవ్వొద్దా? మరి ఎవరికి ఇవ్వాలి. పేదలను కొట్టి తీసుకెళ్లి పెద్ద పెద్ద కార్పొరేట్లకు ఇవ్వాలా? ఇప్పుడు దేశంలో ఇదే జరుగుతోంది” అని కేసీఆర్ ఆరోపించారు.

More Telugu News