Dogs: కుక్కలు చింపిన లాటరీ.. బహుమతి గెల్చుకున్న లాటరీ టికెట్ ను నమిలేసిన పెంపుడు శునకాలు!

  • అదే టికెట్ కు లాటరీ తగిలిందని తెలిసి హతాశులైన దంపతులు
  • ముక్కలైన టికెట్ ను పరిగణనలోకి తీసుకుంటామని లాటరీ నిర్వాహకులు చెప్పడంతో ఆనందం
  • అన్నీ అతికించి చూస్తే ఆ నంబర్ కు వచ్చిన బహుమతి చూసి అవాక్కయిన వైనం
Dogs eat winning lottery ticket

బతుకు కుక్కలు చింపిన విస్తరి అయిందని ఓ సామెత. కానీ కుక్కలు చేసిన పనికి వాటిని పెంచుకుంటున్న వారు మాత్రం హతాశులయ్యారు. ఎందుకంటే బహుమతి గెలుచుకున్న లాటరీ టికెట్ ను తమ పెంపుడు కుక్కలు నమిలేశాయి మరి. అమెరికాలోని ఓరెగాన్ లో ఇటీవల జరిగిన ఈ ఘటన ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

ఇంట్లోని రెండు కుక్కల తీరుతో..
అమెరికాలోని ఓరెగాన్ కు చెందిన నాథన్, రేచల్ లామెట్ అనే దంపతులు అప్పుడప్పుడూ లాటరీ టికెట్లు కొంటుంటారు. అదే క్రమంలో ఇటీవల ఓరెగాన్ కౌంటీ ప్రభుత్వం నిర్వహించే ఫారో డోల్డ్ క్రాస్ వర్డ్ లాటరీ టికెట్ ను మూడు డాలర్లు (సుమారు రూ. 240) కొన్నారు. ఇంట్లో ఓ టేబుల్ పై ఆ లాటరీ టికెట్ ను పెట్టారు. అయితే ఈ దంపతులు అలాస్కన్ క్లీ జాతికి చెందిన రెండు కుక్కలు యాపిల్, జాక్ లను పెంచుకుంటున్నారు. ఇల్లంతా ఉత్సాహంగా తిరిగే యాపిల్, జాక్ శునకాలకు టేబుల్ పై ఉన్న లాటరీ టికెట్లపై కన్నుపడింది. అటూ ఇటూ తిరుగుతూ వాటిని కొరికేశాయి. ఇది చూసిన వాటి యజమానులు టికెట్ ముక్కలను తీసి ఓ పక్కన పెట్టారు.

లాటరీ తగిలిందని తెలిసి..
లాటరీ డ్రా తీసిన రోజున తమ టికెట్ కు బహుమతి వచ్చిందని తెలిసి.. నాథన్, రేచల్ లామెట్ దంపతులు హతాశులయ్యారు. తమ వద్ద ఉన్న లాటరీ టికెట్ ను కుక్కలు కొరికేశాయని.. దానిని పరిశీలనలోకి తీసుకోవాలని కోరారు. లాటరీ సిబ్బంది సూచన మేరకు టికెట్ ముక్కలను తీసుకెళ్లి వారికి ఇచ్చారు. ఆ ముక్కలన్నింటినీ అతికించిన లాటరీ నిర్వాహకులు.. దానిపై ఉన్న నంబర్ ను చూసి లాటరీ మొత్తాన్ని నాథన్ దంపతులకు ఇచ్చారు.

అయితే, తమకు అందిన లాటరీ సొమ్మును చూసి నాథన్ దంపతులు మరోసారి అవాక్కయ్యారు. ఎందుకంటే వారికి వచ్చిన లాటరీ బహుమతి కేవలం ఎనిమిది డాలర్లు (సుమారు రూ.640) మాత్రమే.

  • అంటే మూడు డాలర్లు పెట్టి కొన్న లాటరీ టికెట్ కు ఎనిమిది డాలర్లు వచ్చాయంతే. కుక్కలకు కొరికేయడం, దాని కోసం వారు పడిన శ్రమ అంతా గుర్తు చేసుకుని.. ఈ బహుమతిని చూసుకుని ఉసూరుమన్నారు.
  • అయితే ‘‘కొన్నికొన్ని సార్లు క్రేజీ ఘటనలు జరుగుతుంటాయి. ఇదంతా ఫన్నీగా ఉంది. ఎలాగైతే ఏంటి. ఈ డబ్బుతో కనీసం మా కుక్కలకు కొంచెం ఫుడ్ వస్తుంది. అది తిని అయినా మరి వేటినీ కొరకకుండా ఉంటాయి” అని నాథన్ దంపతులు పేర్కొనడం గమనార్హం. 

More Telugu News