India: నా బంతులతో భారత ఆటగాళ్ల ను చంపేయాలని అప్పుడు మా వాళ్లు చెప్పారు: పాక్​ మాజీ పేసర్ షోయబ్ అక్తర్​

  • 1999లో ఈడెన్ గార్డెన్స్ లో భారత్ పై తొలి టెస్టు ఆడిన అక్తర్
  • మ్యాచ్ కు ముందు టీమ్ మేనేజ్ మెంట్ ఇచ్చిన సందేశాన్ని వెల్లడించిన పాక్ పేసర్
  • భారత ఆటగాళ్ల తల, ఛాతిని లక్ష్యంగా చేసుకొని బంతులు వేసినట్లు వెల్లడి
 Shoaib Akhtar Reveals Message from pakistan Before Facing India For First Time

భారత్- పాకిస్థాన్ క్రికెట్ పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. రెండు జట్లు తలపడినప్పుడల్లా ఇరు దేశాలతో పాటు ప్రపంచ క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి ఉంది. రెండు జట్లలో చాలా మంది మేటి ఆటగాళ్లు ఉండటం, ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు వారి ప్రయత్నాలు ఇండో- పాక్ క్రికెట్లో మరో ప్రత్యేకత. అలాంటి ఆటగాళ్లలో పాక్ మేటి పేసర్ షోయబ్ అక్తర్ ఒకరు. భారత్- పాక్ మ్యాచుల్లో అతను ఎన్నోసార్లు గొప్ప ప్రదర్శన కనబరిచాడు. 

అతని వేగం ప్రపంచంలోని మేటి బ్యాటర్లను వణికించిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, సచిన్, సెహ్వాగ్, గంగూలీ లాంటి భారత దిగ్గజాలు చాలా సార్లు అతనిపై పైచేయి సాధించారు. కానీ, కొన్నిసార్లు మాత్రం తన పేస్ తో అక్తర్ భారత్ ను దెబ్బకొట్టాడు. 1999లో కోల్‌కతాలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అందులో ఒకటి. అక్తర్ 1997లో టెస్టు అరంగేట్రం చేసినప్పటికీ 1999లో ఈడెన్ గార్డెన్ లో భారత్ పై తొలి టెస్టులో పోటీ పడ్డాడు. ఈ మ్యాచ్ లో అతను నాలుగు వికెట్లు పడగొట్టడంతో పాక్ 46 పరుగుల తేడాతో గెలిచింది. 

భారత్ పై తన తొలి టెస్టుకు ముందు పాకిస్తాన్ టీమ్ మేనేజ్మెంట్ నుంచి తనకు వచ్చిన సందేశాన్ని అక్తర్ తాజాగా వెల్లడించాడు. ‘నేను కోల్‌కతా టెస్టులో ఆడతానని తొలుత సలీమ్ మాలిక్ చెప్పాడు. ఈ మ్యాచ్ కోసం జరిగిన మొదటి సమావేశంలో... షోయబ్ నువ్వు వాళ్లను చంపేయాలని అని నాకు చెప్పారు. అంటే నేను వాళ్లను ఔట్ చేయొద్దా? అని ప్రశ్నించా. వద్దు, నీ దగ్గర మంచి వేగం ఉంది. దాంతో, నువ్వు వాళ్లను చంపేయాలి. ఔట్ చేసే బాధ్యత మాది అని చెప్పారు. దాంతో, నేను భారత బ్యాటర్ల ఛాతి, తలనే లక్ష్యంగా చేసుకొని బౌలింగ్ చేశా. ఈ విషయం గురించి సౌరవ్ గంగూలీకి తర్వాత చెప్పా. మా ప్లాన్ మిమ్మల్ని ఔట్ చేయడం కాదు.. మీ పక్కటెముకలను విరగ్గొట్టడమే అని వివరించా’ అని అక్తర్ చెప్పుకొచ్చాడు.

More Telugu News