Telangana: బిల్కిస్​ బానో కేసు విషయంలో ట్రోలింగ్​ కు గురవడంపై స్పందించిన కేటీఆర్​

  • దోషులకు పూల దండలతో స్వాగతం పలకడం మాయని మచ్చ అన్న కేటీఆర్
  • జూబ్లీహిల్స్ మైనర్ బాలిక కేసులో నిందితులకు బెయిల్ విషయాన్ని తెరపైకి తెచ్చి, మంత్రిపై ట్రోలింగ్
  • ఇది సిల్లీ ట్రోలింగ్.. నిందితులకు శిక్ష పడే వరకు పోరాడుతామన్న కేటీఆర్
KTR reacts on being rolled For Backing Bilkis Bano

గుజరాత్‌లోని బిల్కిస్ బానో అత్యాచారం, పలువురి హత్య కేసులో 11 మంది ఖైదీలను విడుదల చేయడాన్ని విమర్శించిన తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగడంపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇవన్నీ ‘సిల్లీ ట్రోల్స్’ అన్నారు. బిల్కిస్ బానో కేసులో విడుదలైన ఖైదీలకు మిఠాయిలు, పూలదండలతో స్వాగతం పలకడంపై స్పందిస్తూ  ‘ఇది మన దేశ సామూహిక మనస్సాక్షికి మాయని మచ్చ. ఈ రోజు బిల్కిస్ బానోకి జరిగినది రేపు మనలో ఎవరికైనా జరగవచ్చు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

 ఈ ట్వీట్ తర్వాత  హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఇటీవల జరిగిన అత్యాచారం కేసును కొందరు తెరపైకి తెచ్చారు. ఈ కేసులోని నిందితులంతా బెయిల్ పై బయటికి రావడంపై కేటీఆర్ పై పలువురు విమర్శలు చేశారు. తనపై ట్రోల్స్ రావడాన్ని గుర్తించిన కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు నిందితులకు శిక్షపడే వరకు పోరాడుతామని చెప్పారు. 

‘ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన అత్యాచారం కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించే సిల్లీ ట్రోల్స్ కు ఇదే సమాధానం. హైదరాబాద్ కేసులో నిందితులను త్వరగా అరెస్టు చేసి జైలుకు పంపారు. 45 రోజుల తర్వాత, హైకోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. రేపిస్టులకు చట్ట ప్రకారం శిక్ష పడే వరకూ మేం పోరాడుతూనే ఉంటాం. జువెనైల్ జస్టిస్ యాక్ట్, ఐపీసీ, సీఆర్పీసీలోని లొసుగుల కారణంగా జూబ్లీహిల్స్ కేసులో రేపిస్టులు బెయిల్‌పై విడుదలయ్యారు. అందుకే ఈ చట్టాలను సవరించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అప్పుడే ఏ రేపిస్ట్ బెయిల్ పొందలేడు. దోషిగా తేలినప్పుడు, మరణించే వరకు జైలులోనే ఉంటాడు’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.

More Telugu News