Pattabhi: త్వరలోనే మాధవ్ వీడియోపై పూర్తి నివేదికను ప్రజల ముందు ఉంచుతాం: టీడీపీ నేత పట్టాభి

  • ఎంపీ మాధవ్ నగ్న వీడియో కాల్ వ్యవహారం
  • ప్రెస్ మీట్ పెట్టిన ఏపీ సీఐడీ చీఫ్
  • స్టాఫోర్డ్ రిపోర్టు వందశాతం వాస్తవం అన్న పట్టాభి 
  • నిజాలను కప్పిపుచ్చడం మానుకోవాలని హితవు
Pattabhi responds on CID Chief Sunil Kumar press meet

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం తెలిసిందే. దీనిపై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పందించారు. ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు చెందిన స్టాఫోర్డ్ ఇచ్చిన నివేదిక తప్పు అని చెప్పడం సరికాదని అన్నారు. స్టాఫోర్డ్ ఇచ్చిన రిపోర్టు నూటికి నూరు శాతం వాస్తవం అని స్పష్టం చేశారు. స్టాఫోర్డ్ కు తాము పంపిన ఈమెయిల్స్, ఇతర ఆధారాలు అన్నీ ఉన్నాయని పట్టాభి వెల్లడించారు. 

నిజం నిప్పులాంటిదని, ఎవరూ కప్పిపుచ్చలేరని ఉద్ఘాటించారు. డర్టీ పిక్చర్ ఎంపీని వెనుకేసుకురావడం సిగ్గుచేటని అన్నారు. మహిళలపై అత్యాచారాలను పట్టించుకోని సీఐడీ ఇప్పుడు తమను బెదిరిస్తోందని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రకాల పరిశోధనలతో కూడిన ఫోరెన్సిక్ నివేదిక తెస్తే, తమపైనే కేసులు పెడుతామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే నివేదిక పూర్తి వివరాలు ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు. 

టీడీపీ నేతలకు తప్పుడు పనులు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నిజాలను కప్పిపుచ్చుకునే కార్యక్రమాలను ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. మాధవ్ బూతు వీడియోను సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాలని పట్టాభి డిమాండ్ చేశారు.

More Telugu News