Venkaiah Naidu: చాలా కాలం తర్వాత ఒక చక్కని సినిమాను చూసిన అనుభూతి కలిగింది: వెంకయ్యనాయుడు

  • 'సీతారామం' సినిమాను వీక్షించిన వెంకయ్యనాయుడు
  • రణగొణధ్వనులు లేకుండా, కళ్లకు హాయిగా ఉండే ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరించారని కితాబు
  • ప్రతి ఒక్కరూ చూడదగిన చిత్రమని ప్రశంస
Venkaiah Naidu praises Sita Ramam movie

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న కాంబినేషన్లో వచ్చిన 'సీతారామం' చిత్రం ఘన విజయాన్ని సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఈ సినిమాను వీక్షించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'సీతారామం' సినిమాను వీక్షించానని... చాలా కాలం తర్వాత ఒక చక్కని సినిమాను చూసిన అనుభూతి కలిగిందని ఆయన అన్నారు. 

రణగొణధ్వనులు లేకుండా, కళ్లకు హాయిగా ఉండే ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరించిన ఈ చిత్ర దర్శకుడు హను రాఘవపూడి, నిర్మాత అశ్వనీదత్, స్వప్న మూవీ మేకర్స్ సహా చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నానని వెంకయ్యనాయుడు చెప్పారు. నటీనటుల అభినయానికి, సాంకేతిక విభాగాల సమన్వయం తోడై చక్కని దృశ్యకావ్యం ఆవిష్కృతమయిందని కొనియాడారు. సాధారణ ప్రేమ కథలా కాకుండా, దానికి వీర సైనికుడి నేపథ్యాన్ని జోడించి, అనేక భావోద్వేగాలను ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరూ చూడదగినదని చెప్పారు.

More Telugu News