Gautam Adani: గౌతమ్​ అదానీకి జడ్​ కేటగిరీ భద్రత కల్పించిన కేంద్రం.. ఖర్చు మాత్రం ఆయనదే

  • సీఆర్ పీఎఫ్ కమాండోలతో భద్రత ఏర్పాటు
  • రక్షణగా ఉండనున్న 33 మంది కమాండోలు 
  • ఇందుకు నెలకు రూ. 15-20 లక్షలను భరించనున్న అదానీ
Gautam Adani Gets Z Security To Cost 15 to 20 Lakhs Per Month

ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీకి కేంద్ర ప్రభుత్వం జెడ్‌ కేటగిరి భద్రత కల్పించింది. వీఐపీలకు ఇచ్చే భద్రత కింద సీఆర్‌పీఎఫ్‌ కమాండోలు ఆయనకు రక్షణ కల్పిస్తారు. మొత్తం 33 మంది కమాండోలు ఆయనకు కాపలాగా ఉంటారు. దేశంలో అదానీ ఎక్కడికి వెళ్లినా కమాండోలు ఆయనకు రక్షణ కవచంలా వ్యవహరిస్తారు. అయితే, ఈ భద్రతకు అయ్యే ఖర్చుని అదానీయే భరించనున్నారు. దీనికి నెలకి రూ.15–20 లక్షలు ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. 

దేశంలోని కొందరు ప్రముఖులకు ముప్పు ఉందని కేంద్ర భద్రతా ఏజెన్సీలు రూపొందించిన నివేదిక ఆధారంగా అదానీకి భద్రత కల్పించినట్లు వారు తెలిపారు. ఈ బాధ్యతను చేపట్టాలని సీఆర్పీఎఫ్ కు చెందిన వీఐపీ సెక్యూరిటీ విభాగానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచించింది.  

కాగా, మరో వ్యాపార దిగ్గజం, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి 2013లో కేంద్ర ప్రభుత్వం సీఆర్పీఎఫ్ కమాండోల జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను అందించింది. ఆ తర్వాత ఆయన భార్య నీతా అంబానీకి సైతం జడ్ కేటగిరీ భద్రతను ఏర్పాటు చేసింది.

More Telugu News