Team India: మహిళా క్రికెటర్లకు శుభవార్త చెప్పిన ఐసీసీ.. అంతర్జాతీయ మ్యాచ్ ల ఖరారు

  • రాబోయే మూడేళ్లకు 310 మ్యాచ్ ల షెడ్యూల్ 
  • 65 మ్యాచ్ లు ఆడనున్న భారత జట్టు
  • వన్డేలు, టీ20లకు ఎక్కువ ప్రాధాన్యత 
Indian womens cricket team to play 65 matches

తగినన్ని అంతర్జాతీయ మ్యాచ్ లు లేక ఇబ్బంది పడుతున్న భారత మహిళా క్రికెటర్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుభవార్త చెప్పింది. రాబోయే మూడేళ్ల కాలంలో భారత జట్టుకు మూడు ఫార్మాట్లలో తగినన్ని మ్యాచ్ లను ఏర్పాటు చేసింది. ఆ మేరకు మహిళా క్రికెట్‌కు సంబంధించిన మూడేళ్ల భవిష్యత్తు ప్రణాళికను విడుదల చేసింది. మే 2022 నుంచి ఏప్రిల్‌ 2025 మధ్య కాలంలో అన్ని దేశాలకు కలిపి మొత్తంగా 310 మ్యాచ్‌ లను షెడ్యూల్ చేసింది. ఇందులో ఏడు టెస్ట్‌లు, 135 వన్డేలు, 159 టీ20లు ఉన్నాయి. పరిమిత ఓవర్ల ఆటకు ఐసీసీ ఎక్కువ ప్రాధాన్యత నిచ్చింది.

ఇందులో చాలా మ్యాచ్ లను భారత జట్టుకు కేటాయించింది. ఈ మూడేళ్లలో భారత మహిళల జట్టు 65 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో రెండు టెస్ట్‌లు, 27 వన్డేలు, 36 టీ20 మ్యాచ్ లు ఉన్నాయి. భారత్.. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాతో ఒక్కో టెస్ట్‌ మ్యాచ్ లో పోటీ పడనుంది. వన్డేలు, టీ20లు కూడా ఎక్కువగా ఈ రెండు జట్లతోనే ఉన్నాయి. మే నెలలోనే అమల్లోకి వచ్చిన ఈ ఎఫ్‌టీపీలో భారత్ ప్రస్తుతానికి 3 వన్డేలు, 3 టీ20లు పూర్తి చేసింది. ఎఫ్‌టీపీ ప్రకారం భారత్ సొంతగడ్డపై న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, ఐర్లాండ్‌తో తలపడనుంది. అదే సమయంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ లో పర్యటించనుంది.

More Telugu News