Road Accident: పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం... 20 మంది సజీవ దహనం

  • పంజాబ్ ప్రావిన్స్ లో దుర్ఘటన
  • ఆయిల్ ట్యాంకర్ ను వెనుక నుంచి ఢీకొట్టిన బస్సు
  • బస్సులో 26 మంది 
  • గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన దేహాలు
  • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పాక్ ప్రధాని
Fatal road accident in Pakistan

పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇక్కడి ఓ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న బస్సు వెనుక నుంచి ఆయిల్ ట్యాంకర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భారీ ఎత్తున మంటలు చెలరేగగా, 20 మంది సజీవదహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 24 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఆ బస్సు కరాచీ నుంచి లాహోర్ వెళుతోంది. కాగా, ఘటన జరిగిన వెంటనే ట్యాంకర్ డ్రైవర్ పరారయ్యాడని పోలీసులు తెలిపారు. 

ఈ ప్రమాదంలో కొందరి దేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. డీఎన్ఏ టెస్టుల ద్వారా మృతదేహాల గుర్తింపు చేపడతామని అధికారులు తెలిపారు. గాయాలపాలైన ఆరుగురిని ముల్తాన్ నగరంలోని నిష్తార్ ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు అభిప్రాయపడ్డారు. రోడ్డు ప్రమాద ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షేబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంతమంది ప్రాణాలు కోల్పవడం కలచివేస్తోందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

More Telugu News