All India Football Federation: అఖిల భారత ఫుట్ బాల్ ఫెడరేషన్ ను సస్పెండ్ చేసిన ఫిఫా.. భారత్ నుంచి తరలిపోనున్న వరల్డ్ కప్

  • ఏఐఎఫ్ఎఫ్ ను సస్పెండ్ చేస్తూ ఫిఫా కౌన్సిల్ ఏకగ్రీవ నిర్ణయం
  • థర్డ్ పార్టీల ప్రభావంతో ఫిఫా నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపణ
  • కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ను నియమిస్తే సస్పెన్షన్ ఎత్తివేస్తామన్న ఫిఫా
FIFA Suspends All India Football Federation

అఖిల భారత ఫుట్ బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)కు అంతర్జాతీయ ఫుట్ బాల్ ఫెడరేషన్ (ఫిఫా) షాకిచ్చింది. భారత ఫుట్ బాల్ ఫెడరేషన్ ను సస్పెండ్ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఫిఫా తెలిపింది. ఈ నిర్ణయాన్ని ఫిఫా కౌన్సిల్ ఏకగ్రీవంగా తీసుకుందని వివరించింది. థర్డ్ పార్టీల ప్రభావంతో ఫిఫా నిబంధనలను ఏఐఎఫ్ఎఫ్ ఉల్లంఘించినందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. 

ఏఐఎఫ్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి సంబంధించి కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ను నియమిస్తామనే ఆదేశాలను వెలువరించేంత వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని.. కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ను ఏర్పాటు చేస్తున్నామనే ఆదేశాలు వచ్చిన వెంటనే సస్పెన్షన్ ను ఎత్తి వేస్తామని ఫిఫా తెలిపింది.

 మరోవైపు, ఈ ఏడాది అక్టోబర్ 11 నుంచి 30 వరకు భారత్ లో ఫిఫా అండర్-17 విమెన్స్ వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. ఏఐఎఫ్ఎఫ్ పై నిషేధం విధించిన నేపథ్యంలో... ఈ టోర్నీని మరో దేశానికి తరలిస్తామని ఫిఫా తెలిపింది. ఇంకోవైపు, భారత యువజన, క్రీడా మంత్రిత్వ శాఖతో టచ్ లో ఉన్నామని వెల్లడించింది. రానున్న రోజుల్లో అంతా సర్దుకుంటుందని భావిస్తున్నట్టు తెలిపింది.

More Telugu News