Chiranjeevi: త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అంజనా దేవి... ఈ ఉత్సవాలు జరుపుకోవడం మనందరి అదృష్టమన్న చిరంజీవి

  • నేడు భారత స్వాతంత్ర్య దినోత్సవం
  • చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో వేడుకలు
  • హాజరైన చిరంజీవి కుటుంబ సభ్యులు
  • మహాత్ముడికి నివాళులు
Independence Day celebrations at Chiranjeevi Charitable Trust

భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాదులోని చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, ఆయన మాతృమూర్తి అంజనా దేవి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, చిరంజీవి సోదరి డాక్టర్ మాధవి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అంజనా దేవి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు, ట్రస్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. 
జెండా వందనం అనంతరం చిరంజీవి ప్రసంగించారు. 75 వసంతాల స్వతంత్ర భారతావని వజ్రోత్సవాలు జరుపుకుంటోందని, ఈ ఉత్సవాలు జరుపుకోవడం మనందరి అదృష్టం అని భావిస్తున్నట్టు తెలిపారు. యావన్మంది స్వాతంత్ర్య సమరయోధుల కృషి, త్యాగఫలితమే మనకు ఈ అదృష్టం కలిగిందని వివరించారు. 

స్వాతంత్ర్య సమరయోధులను కన్న తల్లులను ఈ సందర్భంగా స్మరించుకోవాలని చిరంజీవి అన్నారు. స్వాతంత్ర్య సమరంలోకి వెళ్లండి అంటూ వారు తమ బిడ్డలను ధైర్యంగా పంపించారని, అలాంటి మాతృమూర్తుల త్యాగనిరతిని ఈ సందర్భంగా మనందరం స్మరించుకోవడం సబబుగా ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలోనే తన తల్లి అంజనాదేవితో జాతీయ పతాకావిష్కరణ చేయించడం జరిగిందని వెల్లడించారు.

More Telugu News