Narendra Modi: ‘వారు దేశ విభజన సమయంలో దృఢంగా నిలబడ్డారు..’ నాటి హింసలో చనిపోయినవారికి ప్రధాని మోదీ నివాళులు

  • ఆగస్టు 14 దేశ విభజన గాయాలను జ్ఞాపకం చేసుకునే రోజు
  • ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలంటూ గత ఏడాది ప్రకటించిన ప్రధాని మోదీ
  • ఆ విషాద సమయంలో బాధపడ్డవారి మనోధైర్యాన్ని అభినందిస్తున్నట్టు వెల్లడి
PM Modi pays homage to those who lost their lives during partition

భారత్, పాకిస్థాన్ రెండు దేశాలుగా విభజిస్తూ స్వాతంత్ర్యం ఇస్తున్నట్టు నాడు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 14వ తేదీన అర్ధరాత్రి నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దీనితో పాకిస్థాన్ ప్రాంతంలో, దానికి దగ్గరగా ఉన్న భారత భూభాగంలో భారీ హింస చెలరేగింది. భారత దేశం నుంచి పెద్ద సంఖ్యలో ముస్లింలు పాకిస్థాన్ కు తరలిపోగా.. పాకిస్థాన్ లో హిందువులపై తీవ్రస్థాయిలో దాడులు జరిగాయి. రెండు వైపులా లక్షలాది మంది ఇబ్బందిపడ్డారు. వేలాది మంది చనిపోయారు.

దేశ విభజన నాటి ఈ దారుణాలను, త్యాగాలను గుర్తు చేసుకుంటూ.. ఆగస్టు 14న ‘పార్టిషన్ హర్రర్స్ రిమెంబ్రెన్స్ డే’గా గుర్తు చేసుకోవాలంటూ ప్రధాని మోదీ గత ఏడాదే ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా దేశ విభజన సమయంలో ప్రాణాలు పోగొట్టుకున్న వారికి నివాళి అర్పించారు.

వారి ధీరత్వాన్ని అభినందిస్తున్నా..
‘‘ఈ రోజు, దేశ విభజన భయాందోళన సంస్మరణ దినం. విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నివాళులు అర్పిస్తున్నాను. దేశ స్వాతంత్ర్య చారిత్రక ఘట్టమైన ఆ సమయంలో విభజన కారణంగా బాధలను ఓర్చుకుని ఎందరో దృఢంగా నిలబడ్డారు. వారి ధీరత్వాన్ని, త్యాగాలను అభినందిస్తున్నాను..” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

More Telugu News