Maharashtra: రెండు నెలలు కూడా పూర్తికాకముందే.. ‘మహా’ ప్రభుత్వంలో విభేదాలు?

  • నిన్న బీజేపీ, అసమ్మతి శివసేన నేతలు చెరో 9 మందికి మంత్రి పదవులు
  • మహిళను ఆత్మహత్యకు పురికొల్పిన ఆరోపణలపై గతేడాది మంత్రి పదవి కోల్పోయిన సంజయ్ 
  • ఆయనను మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకున్న ఏక్‌నాథ్ షిండే
  • అసంతృప్తి వ్యక్తం చేసిన బీజేపీ
Sanjay Rathods Entry Leads To Friction As BJP Cites Suicide Case

మహారాష్ట్రలోని శివసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో రెండు నెలలు కూడా కాకముందే విభేదాలు పొడసూపాయి. బీజేపీ, అసమ్మతి శివసేన పార్టీకి చెందిన చెరో తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, శివసేన అసమ్మతి వర్గానికి చెందిన ఎమ్మెల్యే సంజయ్ రాథోడ్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓ మహిళను ఆత్మహత్యకు పురికొల్పాడన్న ఆరోపణపై గతేడాది ఆయన మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే క్యాంపులో ఉన్న ఆయనకు మళ్లీ మంత్రి పదవి లభించింది.

ఇది కూటమి పార్టీల మధ్య విభేదాలకు కారణమైంది. సంజయ్ రాథోడ్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ ఉపాధ్యక్షురాలు చిత్రా వాఘి ట్విట్టర్ ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకముందని, ఆయన మంత్రి అయినా సరే తన పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పారు. పోరాడి విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మాత్రం సంజయ్ నియామకాన్ని సమర్థించుకున్నారు. గత ప్రభుత్వం ఆయనపై విచారణ జరిపి క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అందుకనే ఆయనకు మంత్రి పదవి ఇచ్చినట్టు వివరించారు. ‘అది సంజయ్ కారణంగా జరిగిన ఆత్మహత్య కాదు.. హత్య’ అంటూ గతేడాది తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత కిరీట్ సోమయ.. నిన్న జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనడం గమనార్హం.

More Telugu News