Kalvakuntla Kavitha: సంక్షేమ పథకాలను తాయిలాలు అనడం పేదలను అవమానించడమే: కేంద్రం, బీజేపీపై కల్వకుంట్ల కవిత ఫైర్

  • కేంద్రం, బీజేపీ తీరు సరికాదన్న కవిత 
  • కార్పొరేట్లకు రుణాల మాఫీ ఎందుకు చేశారని నిలదీత
  • వీలైతే సంక్షేమ పథకాల అమలు కోసం సాయం చేయాలని విజ్ఞప్తి
Kalvakuntla Kavitha fires on BJP central government

దేశ జనాభాలో ఎక్కువ మంది పేదలేనని.. కేంద్రంగానీ, రాష్ట్రాలుగానీ ఏ ప్రభుత్వమైనా సరే వారి సంక్షేమం కోసం పథకాలను అమలు చేస్తాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత అన్నారు. పేదల కోసం అమలు చేసే సంక్షేమ పథకాలను ఉచితాలు, తాయిలాలు అంటూ కేంద్రం, బీజేపీ ప్రచారం చేయడం సరికాదని.. పేదలను అవమానించడమేనని మండిపడ్డారు.

మరి కార్పొరేట్ల రుణమాఫీని ఏమనాలి?
పేదలకు ప్రయోజనం కలిగించే సంక్షేమ పథకాలను తాయిలాలు అంటున్న కేంద్ర ప్రభుత్వం.. బ్యాంకులను దోచుకున్న కార్పొరేట్ల రుణాలను మాఫీ చేయడం ఏమిటని, దానిని ఏమనాలని కవిత ప్రశ్నించారు. పేదల ఆరోగ్యం, వారి పిల్లలకు విద్య కోసం, వ్యవసాయం కోసం అమలు చేస్తున్న పథకాలు తాయిలాలు కాదని స్పష్టం చేశారు. ఇలాంటి మాటలు మాట్లాడుతూ పేదలను అవమానించడం మానుకోవాలని బీజేపీ నేతలకు సూచించారు.

వీలైతే సాయం చేయండి
పేదలకు ఉచిత విద్య, విద్యుత్, ఆరోగ్యం అందించే పథకాలకు వ్యతిరేకంగా ఒక వాతావరణాన్ని సృష్టించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కవిత ఆరోపించారు. వీలైతే రాష్ట్రాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాయం చేయడం ఇష్టం లేకపోతే ఊరుకోవాలేగానీ.. రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుపట్టడం సరికాదన్నారు.

More Telugu News