Vijayasai Reddy: వెంకయ్యనాయుడుపై ప్రశంసలు కురిపించిన విజయసాయిరెడ్డి

  • రాజ్యసభను ఎంతో హుందాగా నడిపారన్న విజయసాయి 
  • ఏడేళ్ల క్రితం చివరి వరుసలో కూర్చున్న తనకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చారని వెల్లడి 
  • ఆయన ప్రసంగాలు దేశ వ్యాప్తంగా ఎంతో మందిని ప్రభావితం చేశాయని వ్యాఖ్య 
Vijayasai Reddy praises Venkaiah Naidu

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి వీడ్కోలు సభలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆయనపై ప్రశంసలు కురిపించారు. రాజ్యసభ అధ్యక్ష స్థానంలో మన తెలుగు వ్యక్తి కూర్చోవడం ఉభయ సభల్లోని తెలుగు రాష్ట్రాల ఎంపీలు గర్వంగా చెప్పుకుంటారని తెలిపారు. పెద్దల సభను ఆయన ఎంతో హుందాగా నడిపారని కొనియాడారు. వెంకయ్యనాయుడు సొంత జిల్లా నెల్లూరుకు చెందిన వ్యక్తిని కావడం తనకు గర్వకారణమని చెప్పారు.  

తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ వంటి పలు భాషల్లో వెంకయ్యకు ఉన్న పరిజ్ఞానం చాలా గొప్పదని అన్నారు. రాజ్యసభలో పాత, కొత్త అనే తేడా లేకుండా సభ్యులందరికీ మాట్లాడే అవకాశాన్ని కల్పించారని ప్రశంసించారు. అనేక సభల్లో వెంకయ్యనాయుడు చేసిన ప్రసంగాలు తెలుగు ప్రజలనే కాకుండా, దేశ వ్యాప్తంగా ఎంతో మందిని ప్రభావితం చేశాయని అన్నారు. విద్యార్థి దశలో తాను కూడా ప్రభావితమయ్యానని చెప్పారు. 

ఆరేళ్ల క్రితం తాను రాజ్యసభలో అడుగుపెట్టినప్పుడు చివరి వరుసలో కూర్చున్నానని... అప్పుడు తనకు మాట్లాడే అవకాశం వస్తుందో, రాదో అని సంశయిస్తున్న సమయంలో... అంతమందిలో తనను గుర్తించి మాట్లాడే అవకాశాన్ని కల్పించారని చెప్పారు. 2019 ఆగస్ట్ 5న ఆర్టికల్ 370పై ఉద్రిక్త వాతావరణంలో చర్చ జరుగుతున్న సమయంలో... ప్రాంతీయ పార్టీలకు సైతం మాట్లాడేందుకు అవకాశాన్ని ఇవ్వడం వెంకయ్య గొప్పదనానికి నిదర్శనమని అన్నారు.

పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలకు ఆయన అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారని చెప్పారు. వైస్ ఛైర్మన్ ప్యానల్ గా రాజ్యసభ అధ్యక్ష స్థానంలో కూర్చొని సభను నిర్వహించే అవకాశాన్ని తనకు కల్పించడం తన జీవితంలో మర్చిపోలేని ఘట్టమని ఆయన అన్నారు. వెంకయ్యనాయుడు ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని విజయసాయి చెప్పారు.

More Telugu News