Kerala: కుమారుడిని చదివించేందుకు తాను చదివి.. కుమారుడితోపాటు తానూ జాబ్​ కొట్టిన మహిళ!

  • పదేళ్లుగా కుమారుడి చదువులో తోడ్పాటు అందిస్తూ వచ్చిన బిందు
  • కుమారుడితోపాటు కోచింగ్ సెంటర్ లో చేరి ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం
  • ఇటీవలి కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో తల్లి, కుమారుడు ఇద్దరికీ ఉద్యోగాలు
Kerala woman and son to join government service together

ఆమె కేరళకు చెందిన మహిళ.. అంగన్ వాడీ టీచర్ గా పనిచేసేది.. కుమారుడిని బాగా చదివించాలన్నది ఆమె ఉద్దేశం. అందుకే కుమారుడికి పాఠాలు బాగా అర్థం చేయించేందుకు తానూ పుస్తకాలు చదివింది. బాగా కష్టపడింది. ఈ శ్రమ ఎక్కడా వృథా పోలేదు. అటు కుమారుడిని ప్రోత్సహిస్తున్నట్టూ అయింది. ఆమెకూ సబ్జెక్టులన్నింటి మీదా పట్టు వచ్చింది. ఇటీవల ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో కుమారుడితోపాటు ఆమెకూ ప్రభుత్వ ఉద్యోగం రావడం గమనార్హం. ఇదంతా 42 ఏళ్ల బిందు అనే మహిళ విజయగాథ.

పదేళ్ల నుంచి చదువుతూ..

  • బిందు దాదాపు పదేళ్ల కిందట తన కుమారుడి కోసం పుస్తకాలు పట్టింది. చదువుతూ చదువుతూ కుమారుడిని డిగ్రీ వరకు ప్రోత్సహించింది. ప్రతి దశలో, ప్రతి టాపిక్ పై కలిసి డిస్కస్ చేస్తూ.. పరీక్షలకు సిద్ధం చేసింది.
  • ఆ తర్వాత కుమారుడు ఉద్యోగం సాధించాలని ఓ కోచింగ్ సెంటర్ లో చేర్పించింది. అయితే కుమారుడితో పాటు తానూ అందులో చేరి ప్రభుత్వ ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకుంది. వరుసగా ప్రభుత్వ పోటీ పరీక్షలు కూడా రాయడం మొదలుపెట్టింది. అలా తల్లీకుమారుడు కలిసి ఇప్పటివరకు మూడు సార్లు పోటీ పరీక్షలు రాశారు. 
  • ఇటీవల తల్లి, కుమారుడు ఇద్దరూ కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాశారు. అందులో లాస్ట్ గ్రేడ్ సర్వెంట్స్ (ఎల్ జీఎస్) పరీక్షలో బిందుకు రాష్ట్రంలోనే 92వ ర్యాంకు వచ్చింది.
  • బిందు 24 ఏళ్ల కుమారుడికి లోయర్ డివిజనల్ క్లర్క్ (ఎల్ డీసీ) పరీక్షలో 38వ రాష్ట్ర ర్యాంకు వచ్చింది. 
  • ఇద్దరికీ ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు ఖాయం కావడంతో వారి కుటుంబంలో ఆనందానికి అంతే లేకుండా పోయింది. చిత్రం ఏమిటంటే.. కుమారుడి కోసం తాను పుస్తకాలు పట్టినా.. తన కుమారుడు, కోచింగ్ సెంటర్ లోని ఫ్యాకల్టీనే తన విజయానికి కారణమని బిందు చెబుతుండడం గమనార్హం.

More Telugu News