Parvathi Devi Idol: అర్ధశతాబ్దం కిందట కనిపించకుండా పోయిన పార్వతీదేవి విగ్రహం న్యూయార్క్ లో గుర్తింపు

  • నాదన్ పురేశ్వర్ శివన్ ఆలయంలో మాయమైన విగ్రహం
  • ఇది చోళుల కాలం నాటి పార్వతీదేవి విగ్రహం
  • కేసులో దర్యాప్తు చేసిన తమిళనాడు సీఐడీ పోలీసులు
  • ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ఇన్ స్పెక్టర్ చిత్ర
Missing Parvathidevi idol spotted in New York

తమిళనాడులోని కుంభకోణంలో నాదన్ పురేశ్వర్ శివన్ ఆలయంలో 50 ఏళ్ల కిందట పార్వతీదేవి విగ్రహం మాయమైంది. ఇన్నాళ్లకు ఆ విగ్రహం ఆచూకీ లభ్యమైంది. అర్ధశతాబ్ద కాలం తర్వాత అమ్మవారి విగ్రహాన్ని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ లో గుర్తించినట్టు తమిళనాడు సీఐడీ పోలీసులు వెల్లడించారు. కాగా, దీనిపై 1971లోనే కేసు నమోదైంది. 2019లో మరో వ్యక్తి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ పోలీసులు (విగ్రహాల విభాగం) చురుగ్గా రంగంలోకి దిగింది. 

ఈ కేసు దర్యాప్తును నడిపించిన సీఐడీ విగ్రహాల విభాగం ఇన్ స్పెక్టర్ ఎం.చిత్ర ఎంతో పరిశోధన సాగించి విగ్రహం ఆచూకీ కనిపెట్టడంలో విజయం సాధించారు. చోళుల కాలం నాటి పార్వతీదేవి విగ్రహాల గురించి మ్యూజియంలలోనూ, విదేశాల్లోని వేలం విక్రయ సంస్థల్లోనూ శోధించారు. ఆమె కృషి ఫలించి, వారు వెదుకుతున్న పార్వతీదేవి విగ్రహం న్యూయార్క్ లోని బోన్హామ్స్ వేలం సంస్థలో ఉన్నట్టు గుర్తించారు. 

రాగి మిశ్రమంతో తయారైన ఈ విగ్రహం ఖరీదు రూ.1.6 కోట్లు ఉంటుందని అంచనా. ఇది 12వ శతాబ్దానికి చెందిన విగ్రహంగా భావిస్తున్నారు. ఈ విగ్రహాన్ని భారత్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

More Telugu News