Jeevan Reddy: దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ ను వీడటం బాధాకరం.. అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు: జీవన్ రెడ్డి

  • పీసీసీ అధ్యక్షుడు కేవలం సమన్వయకర్త మాత్రమేనన్న జీవన్ రెడ్డి
  • రేవంత్ రెడ్డి ఆయన పరిధిలోనే పని చేస్తున్నారని కితాబు 
  • రేవంత్ కు, రాజగోపాల్ రెడ్డికి మధ్య ఏం జరుగుతోందో తనకు తెలియదని వ్యాఖ్య 
Jeevan Reddy comments on Dasoju Sravan

దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీని వీడటం బాధాకరమని ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పీసీసీ అధ్యక్షుడు కేవలం రాష్ట్ర పార్టీ యంత్రాంగానికి, హైకమాండ్ కు సమన్వయకర్త మాత్రమేనని చెప్పారు. ప్రతి ఒక్క నాయకుడిని సంతృప్తి పరచడం సాధ్యం కాదని అన్నారు. సోనియా నాయకత్వంలోనే అందరం పని చేస్తున్నామని చెప్పారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఆయన పరిధిలోనే పని చేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డికి, రాజగోపాల్ రెడ్డికి మధ్య ఏం జరుగుతోందో తనకు తెలియదని చెప్పారు. 

మల్లు రవి మాట్లాడుతూ... రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ను చంపి, బీజేపీని బతికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దాసోజు శ్రవణ్ పై ఒత్తిడి తెచ్చి పార్టీ మారేలా చేశారని అన్నారు. బీజేపీ వాళ్ల రాజకీయాలు దిగజారిపోయాయని చెప్పారు. దాసోజు శ్రవణ్ పై తాను వ్యక్తిగతంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని... అయితే, రేవంత్ రెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలను మాత్రం ఖండిస్తున్నానని అన్నారు.

More Telugu News