Vaishnaw: ఆశించినట్టుగా పనిచేయాల్సిందే.. లేదంటే ప్యాకప్: బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు కేంద్ర మంత్రి వార్నింగ్

  • సర్కారు మనస్తత్వాన్ని వదులుకోవాలని హితవు
  • పోటీతత్వంతో పనిచేయాలని సూచన
  • పని చేయకపోతే తామే ఇంటికి పంపిస్తామన్న టెలికం మంత్రి
Do what is expected of you or pack up Telecom Minister Vaishnaw ultimatum to BSNL employees

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ గట్టి హెచ్చరిక పంపారు. సర్కారీ మనస్తత్వాన్ని వదులుకోవాలని సూచించారు. ఇటీవలే బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు రూ.1.64 లక్షల కోట్లతో కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీని ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ సీనియర్ యాజమాన్యంతో మంత్రి సమావేశం నిర్వహించారు. 

‘‘ఆశించిన మేర మీరు పనిచేయాలి. లేదంటే ప్యాకప్ చెప్పుకోవాల్సిందే. ఈ విషయంలో మీకు ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇకమీదట ఇది ఒక సాధారణ నియమం. పనిచేయడమా లేదంటే వెళ్లిపోవడమా’’ అని మంత్రి బీఎస్ఎన్ఎల్ టాప్ ఉద్యోగులకు తేల్చి చెప్పారు. ఎంతో పోటీతత్వంతో పనిచేయాలని సూచించారు. టాప్ ప్రైవేటు కంపెనీలతో పోటి పడాల్సి ఉంటుందన్నారు.

‘‘పనిచేయడం ఇష్టం లేని వారు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) తీసుకుని ఇంటికి పోవడమే. వారు వీఆర్ఎస్ తీసుకోవడానికి ముందుకు రాకపోతే మేమే 56జే నిబంధన వాడతాం’’ అని మంత్రి పేర్కొన్నారు. బీఎస్ఎన్ఎల్ ఎక్చేంజ్ లు, కార్యాలయాల్లో అపరిశుభ్ర వాతావరణాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. మెరుగ్గా పని చేయకపోతే ఉన్నతోద్యోగులను సైతం తొలగిస్తామని, ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నామని వారికి మంత్రి తేల్చి చెప్పారు. 

More Telugu News