Rupee: రూపాయికి మళ్లీ దెబ్బ.. డాలర్ తో మారకం రూ.79.54కి పతనం!

  • వారం రోజులుగా కోలుకున్న రూపాయి మళ్లీ పతన బాట
  • మూడు రోజులుగా వరుసగా తగ్గిపోతున్న విలువ
  • డాలర్ బలపడటం, అంతర్జాతీయ పరిణామాలతో రూపాయిపై ఎఫెక్ట్
Rupee plunges against dollar

కొంతకాలం నుంచి వరుసగా పతనమవుతూ వచ్చి, తిరిగి కోలుకునే బాటలో కదిలిన రూపాయి.. మళ్లీ పతనం బాట పట్టింది. డాలర్ తో మారకం విలువ రూ.80కి సమీపం దాకా వెళ్లి.. రూ.78.50 వరకు కోలుకున్నా.. మూడు రోజులుగా వరుసగా దెబ్బతింటోంది. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికాలో ఫెడ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలతో డాలర్లకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. విదేశీ మదుపర్లు భారత్ నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఈ పరిణామంతో రూపాయి మళ్లీ పతనం అవుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఊగిసలాట మధ్య
కరెన్సీ ఫారెక్స్ ఎక్ఛేంజీలో బుధవారం డాలర్ తో రూ.79.16 పైసల వద్ద ముగిసిన రూపాయి.. గురువారం ఉదయం నుంచి బలహీనంగానే ట్రేడ్ అయింది. గరిష్ఠంగా రూ.79.19 వద్ద కాసేపు కొనసాగిన రూపాయి.. ఒక దశలో రూ.79.82 పైసల వరకూ పతనమైంది. కానీ రిజర్వు బ్యాంకు డాలర్లను అందుబాటులోకి తేవడంతో కోలుకుని.. రూ.79.54 పైసల వద్ద ముగిసింది. బుధవారంతో పోలిస్తే గురువారం 40 పైసల నష్టం వద్ద రూపాయి ట్రేడ్ అయినట్టు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా గత నెల రోజుల్లో చారిత్రక కనిష్ట స్థాయిని తాకిన రూపాయి విలువ.. మళ్లీ కనిష్ఠ రికార్డును బ్రేక్ చేస్తుందేమోనన్న అభిప్రాయాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.

More Telugu News