Nimmala Rama Naidu: ఇంటింటికీ తిరిగి పేపర్ వేసిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.. వీడియో ఇదిగో!

  • టిడ్కో ఇళ్ల పంపిణీలో జాప్యాన్ని నిరసిస్తూ పేపర్ బాయ్‌గా మారిన ఎమ్మెల్యే
  • పేపర్ వేస్తూ ప్రభుత్వ తీరుపై ప్రజలకు వివరించిన రామానాయుడు
  • ప్రతి నెలా నాలుగు రోజులు ఇలాగే చేస్తానన్న టీడీపీ నేత 
TDP MLA Nimmala Rama Naidu distributed news papers in Palakollu

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేపర్ బాయ్ అవతారం ఎత్తారు. ఇంటింటికి వెళ్లి చందాదారులకు దినపత్రికలు వేశారు. ఆయన ఇలా పేపర్ బాయ్‌గా మారడం వెనక ఓ కథ ఉంది. టిడ్కో ఇళ్లలో మిగిలిన పదిశాతం పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వడంలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ ఆయనిలా పేపర్ బాయ్‌గా మారారు. నిన్న తెల్లవారుజామున పట్టణంలోని మావుళ్లమ్మపేటకు చేరుకున్న ఎమ్మెల్యే.. స్థానిక పేపర్ బాయ్స్‌తో కలిసి సైకిలుపై ఇంటింటికీ వెళ్లి చందాదారులకు పేపర్లు పంపిణీ చేశారు.

31వ వార్డులోని నాగరాజుపేట సహా పలు ప్రాంతాల్లో పేపర్ వేశారు. దినపత్రిక తీసుకునేందుకు వచ్చిన వారికి టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వివరించారు. పట్టణవాసులకు పది కిలోమీటర్ల దూరంలో టిడ్కో ఇళ్లు కేటాయించడాన్ని ప్రశ్నించారు. ఈ  సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ.. ప్రతి నెలా నాలుగు రోజులు ఇలా దినపత్రికలు వేస్తూ చందాదారులను కలిసి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల గురించి వారికి తెలియజేస్తానన్నారు. అలాగే, మరో నాలుగు రోజుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి నిరసన తెలుపుతానని ఎమ్మెల్యే వివరించారు.

More Telugu News